జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: హింసాత్మకంగా మారిన పోలింగ్..పోలీసు కాల్పుల్లో ఒకరు మృతి
గుమ్లా: జార్ఖండ్ రెండో దశ పోలింగ్ జరుగుతోంది. అయితే సిసాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ హింసాత్మకంగా మారింది. సిసాయ్లోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా వారిపై రాళ్ల దాడి చేశారు కొందరు. అల్లరి మూకలను నిలువరించేందుకు పోలీసులు కాల్పలు జరిపారు. ఈ ఘటనలో ఒక గ్రామస్తుడు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఇక అల్లరి మూకలు రాళ్లు రువ్వడంతో సిసాయ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక జర్నలిస్టులకు గాయాలయ్యాయి. ఈ ఘటన గుమ్లా జిల్లా సిసాయ్ నియోజకవర్గంలోని బద్ని గ్రామంలో చోటుచేసుకుంది. 36వ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది.
అప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్ ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. ఆర్పీఎఫ్ సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కునేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు.దీంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఇక ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఒకరు మృతి చెందగా మరొకరి భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. గాయాలపాలైన వారిని రాంచీ హాస్పిటల్కు తరలించడం జరిగిందని జార్ఖండ్ సీఈఓ వినయ్ చౌబే చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం రెండు రాజకీయ పార్టీలకు చెందిన మనుషులు పోలింగ్ బూత్వద్ద గొడవకు దిగారు. అక్కడే ఉన్న పోలీసులు వారిన చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.అయితే పోలీసులతో సైతం గొడవకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసుల దగ్గర ఉన్న తుపాకులను లాక్కునే ప్రయత్నం చేశారు. అంతేకాదు వారిపైకి రాళ్లు రువ్వడంతో ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు చౌబే. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని గిలానీ అన్సారీగా గుర్తించారు. గాయపడిన వారిని అస్ఫఖ్ అన్సారీ, ఖూఫా అన్సారీలుగా గుర్తించారు. గాయపడ్డ వారిని గుమ్లా సదార్ హాస్పిటల్కు చికిత్సకోసం పంపారు.