జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: జేఎంఎం, కాంగ్రెస్ కూటమి హవా.. బీజేపీ బేజారు
Recommended Video
జార్ఖండ్: జార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యే దిశగా అక్కడ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యను జేఎంఎం- కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి క్రాస్ చేసింది. ప్రస్తుతం ముందంజలో మాత్రమే ఉంది. ఇక ఇప్పటికే రెండు జాతీయ పార్టీలు అయిన బీజేపీ కాంగ్రెస్లు ఫలితాలు వెలువడుతుండటంతో ఇతర చిన్న పార్టీల నాయకత్వాలతో టచ్లోకి వచ్చేశాయి.
జార్ఖండ్లో మొత్తం 81 స్థానాలుండగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 42 స్థానాల మార్క్ను కాంగ్రెస్ జేఎంఎం ఆర్జేడీ కూటమిలు టచ్ చేశాయి. మరో 29 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఇక 2014 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలువని ఆర్జేడీ.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మంచి ట్రెండ్స్ను కనబరుస్తోంది. బీహార్ జార్ఖండ్లలో ఆర్జేడీకి పట్టున్న ప్రాంతాల్లో ఆ పార్టీ 5 స్థానాల్లో ముందంజలో ఉంది. అప్పటి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన కౌంటింగ్... ఒక్కసారిగా ఆర్జేడీ 5 స్థానాల్లో ముందంజలో ఉండటంతో ట్రెండ్ ఒక్కసారిగా జేఎంఎం కాంగ్రెస్ కూటమివైపు మారింది. ఇదిలా ఉంటే ఒకానొక దశలో హేమంత్ సోరెన్ రెండు స్థానాల్లో వెనుకంజలో ఉండగా... కాసేపటికి తిరిగి ఒక స్థానంలో పుంజుకున్నారు.
ఇక తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా హేమంత్ సోరెన్ ఉంటారని ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్. హేమంత్ సోరెన్ నేతృత్వంలోనే తామంతా ఎన్నికల్లో పోటీ చేశామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే జేవీపీ చీఫ్ బాబూలాల్ మరాండీ మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాతే చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు.
పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చాకే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీజేపీ నేతలు టచ్లోకి వచ్చారా అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి చర్చలు తమతో జరపలేదని బాబూలాల్ మరాండీ చెప్పారు. అదేసమయంలో ఏపార్టీ అయినా సరే తమతో చర్చించేందుకు వస్తే స్వాగతిస్తామని క్లారిటీ ఇచ్చారు బాబూలాల్ మరాండీ. ఒకవేళ జార్ఖండ్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమిలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ఏడాదిలో బీజేపీ 5వ రాష్ట్రాన్ని కోల్పోయినట్లుగానే భావించాలి.