ఉత్కంఠ: మరికొద్ది గంటల్లో వెలువడనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ రాష్ట్రంలో ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా రాష్ట్రంలోని అధికార బీజేపీకి ఓటమి తప్పదని తేల్చేశాయి.
జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి జార్ఖండ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని స్పష్టం చేశాయి. మెజార్టీ సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించిన నేపథ్యంలో సోమవారం విడుదల కానున్న జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాంగ్రెస్-జేఎంఎం కూటమికి 50కి పైగా స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇక అధికార బీజేపీకి 22-30 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉందని వెల్లడించాయి. అయితే, జార్ఖండ్ రాష్ట్రంలో కూడా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తరహా రాజకీయ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా, జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా 42 ఎమ్మెల్యేలు అవసరం. అయితే, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలిస్తేనే మ్యాజిక్ ఫిగర్ దాటనుంది.
ఎగ్జిట్ పోల్స్ తీవ్ర నిరాశకు గురిచేసినప్పటికీ జార్ఖండ్ బీజేపీ నేతలు మాత్రం తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రఘువర్ దాస్ తమ విజయంపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర నేతలు ఉధృతంగా ప్రచారం నిర్వహించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ కూడా జోరుగా ప్రచారం చేశారు. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో అధికారం కోల్పోయిన బీజేపీకి.. జార్ఖండ్ ఫలితాలు కూడా షాకిస్తాయా? అనేది ఉత్కంఠగా మారింది.