Kashish News Exit Poll Results: జార్ఖండ్లో కాంగ్రెస్ హవా, వెనకబడ్డ బీజేపీ
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. కాశీష్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని తేల్చింది.
Spick Media Network exit polls: కాంగ్రెస్కే పట్టం కట్టిన జార్ఖండ్
కాశీష్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్
కాశీష్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీకి 25-30, కాంగ్రెస్ పార్టీ కూటమికి 37-49, ఏజేఎస్యూ 2-4, ఇతరులు 2-4 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. 81 అసెంబ్లీ సీట్లు కలిగిన జార్ఖండ్ రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్ అయిన 42 సీట్లు వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టైమ్స్ నౌ ఇలా..
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి 44 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని టైమ్స్ నౌ లెక్కగట్టింది. కూటమిలో జేఎంఎం 23 సీట్లు దక్కనుండగా, కాంగ్రెస్ పార్టీకి 16 సీట్లు, ఆర్జేడీకి 5 స్థానాల్లో విజయం సాధిస్తోందని తెలియజేసింది. బీజేపీ 28 సీట్లు, జేవీఎం 3 సీట్లతో సరిపెట్టుకుందని వెల్లడించింది. ఇతరులు ఆరు సీట్లను గెలవనుండగా ఏజేఎస్యూ ఖాతా తెరవబోదని చెప్పడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడని విషయం.
ఐయాన్స్-సీ ఓటర్స్-ఏబీపీ ఎగ్జిట్ పోల్స్:
ఇక ఐయాన్స్-సీ ఓటర్స్-ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. 81 అసెంబ్లీ సీట్లు కలిగిన జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పాటుు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. అధికార బీజేపీ కూటమికి 28-36 సీట్లు వచ్చే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ పార్టీ కూటమికి 31-39 నుంచి సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక జేవీఎంపీకి 1-4, ఏజేఎస్యూకి 3-7 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేల్చింది.
హంగ్ అంటూ పలు సర్వేలు..
అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 40కి సీట్లు రావాల్సి ఉంది. ఐయాన్స్- సీఓటర్స్-ఏబీపీ సర్వే ప్రకారం.. 40కి పైగా స్థానాలు అటు బీజేపీకి గానీ, ఇటు కాంగ్రెస్ పార్టీకి గానీ రాలేదు. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇతర పార్టీల మద్దతు తీసుకుని కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే సీట్లు ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. 81 అసెంబ్లీ సీట్లు కలిగిన జార్ఖండ్ రాష్ట్రంలో ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు చివరి దశ పోలింగ్ ముగిసింది.