జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: తొలి దశలో 13 నియోజకవర్గాలకు ప్రారంభమైన పోలింగ్
రెండు నెలల తర్వాత మరో రాష్ట్ర అసెంబ్లీకి పోలింగ్ ప్రారంభమైంది. జార్ఖండ్ రాష్ట్రానికి తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 13 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఆరు జిల్లాల్లో ఉదయం పోలింగ్ మొదలైంది. మొత్తం 3.7 మిలియన్ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బరిలో అన్ని పార్టీలకు సంబంధించి 189 మంది ఉన్నారు. ఇందులో 15 మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు.
ఇక శనివారం జార్ఖండ్లో జరుగుతున్న తొలిదశ పోలింగ్లో కొందరు ప్రముఖులు బరిలో నిలిచారు. జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి రామచంద్ర చంద్రవంశీ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ అధికారి రామేశ్వర్ ఓరాన్ కూడా పోటీలో ఉన్నారు. ఓరాన్ మాజీ పీసీసీ చీఫ్ సిట్టింగ్ ఎమ్మెల్యే సుఖ్దేవ్ భగత్పై పోటీ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే సుఖ్దేవ్ భగత్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు.
Jharkhand: Voting continues at a polling booth in a Govt school in Lohardaga. Voting on 13 constituencies in the state for the first phase of elections is underway. #JharkhandAssemblyPolls pic.twitter.com/IiD3rIR50M
— ANI (@ANI) November 30, 2019
చత్ర, గుమ్లా, బిష్ణుపూర్, లోహర్దగా, మానికా, లాతెహార్, పంకి, దల్తోగంజ్, బిశ్రమ్పూర్, ఛత్తర్పూర్, హుసేనాబాద్, గర్హ, భవంత్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తంగా 3,906 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇందులో 989 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ సదుపాయాలను కల్పించింది. ఇక మూరుమూల గ్రామాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్కు సిబ్బందిని హెలికాఫ్టర్లలో చేర్చింది ఎన్నికల సంఘం.మొత్తం 1097 పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన ఈసీ... 461 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకంగా గుర్తించింది. పోలింగ్ సందర్భంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది.