కౌంటింగ్.. జార్ఖండ్: కాంగ్రెస్ కూటమి వైపే ట్రెండ్.. నెక్ టు నెక్..!
Recommended Video
రాంచీ: జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు జార్ఖండ్ లోని 24 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును ఆరంభించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే ఆరంభ ఫలితాలు కాంగ్రెస్ సంకీర్ణ కూటమి వైపే మొగ్గు చూపాయి. కాంగ్రెస్-జార్ఖండ్ ముక్తి మోర్చా-రాష్ట్రీయ జనతాదళ్ కూటమి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్-జార్ఖండ్ ముక్తి మోర్చాల ఆధిక్యత ఎక్కడా తగ్గలేదు.
రెండో స్థానంలో
ఇదే కూటమిలో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ ఒక్క చోట కూడా ఆధిక్యాన్ని కనపర్చలేదు. భారతీయ జనతా పార్టీ రెండో స్థానానికే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. ప్రారంభ ఫలితాల్లో బీజేపీ-లోక్ జనశక్తి పార్టీ-అఖిల జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ సంకీర్ణ కూటమి వెనుకంజలో నిలిచింది. అయినప్పటికీ.. చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. కొన్ని కీలక నియోజకవర్గాల్లో రౌండ్ రౌండ్ కూ ఆధిక్యత చేతులు మారుతుండటంతో బీజేపీ కూటమిలో ఆశలను నింపుతోంది.
రఘుబర్ దాస్.. హేమంత్ సోరెన్.. లీడ్
జార్ఖండ్ ముక్తి మోర్జా సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి హేమంత్ సోరెన్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దుమ్కా బర్హెట్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేశారు. రెండు చోట్లా ఆయన ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత రఘుబర్ దాస్ లీడ్ లో కొనసాగుతున్నారు. జంషెడ్ పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ కూటమి అభ్యర్థిపై ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థులు వారే..
కాంగ్రెస్ సంకీర్ణ కూటమి అధికారంలోకి రావడమంటూ జరిగితే- హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకోవడం ఖాయం. ఇదివరకే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. పైగా-హేమంత్ సోరెన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ కూటమి ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ కూటమి వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకుంటే.. ముఖ్యమంత్రిగా రఘుబర్ దాస్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
మేజిక్ ఫిగర్ కోసం..
చందన్ క్యారీ, టోర్పా నియోజకవర్గాల ఫలితాలు అన్నింటి కంటే ముందుగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. 28 రౌండ్ల వరకూ కొనసాగబోయే ఛత్రా నియోజకవర్గం ఫలితం చిట్టచివరిగా వెలువడబోతోంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలం 41. ఈ మేజిక్ ఫిగర్ ను అందుకునే వారిదే అధికారం. ఆ ఛాన్స్ ఒక్క కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీకే ఉందంటూ జాతీయస్థాయిలో అన్ని ప్రధాన ఛానళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మహారాష్ట్ర తరహా ఎన్నికల వాతావరణం నెలకొనే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని అభిప్రాయపడ్డాయి.