ఖర్చుపై ఇక ఆందోళన వద్దు: మోడీ, నేడు జార్ఖండ్లో ఆయుష్మాన్ భారత్
న్యూఢిల్లీ: 10.74కు పైగా కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూర్చే, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జాతీయ ఆరోగ్య రక్షణ పథకం.. ఆయుష్మాన్ భవను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం జార్ఖండ్లో ప్రారంభిస్తారు. ఈ మేరకు లబ్ధిదారులకు ప్రధాని మోడీ లేఖ రాశారు. వీటిని వారు అందుకోనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యబీమా.
ఇందులో ప్రధాని మోడీ ఫొటోతో పాటు బీమా పథకం వల్ల కలిగే లాభాలను, ఏయే ఆసుపత్రులలో ఇది వర్తిస్తుందనే వివరాలను పొందుపర్చారు. ఆదివారం జార్ఖండ్లోని 57లక్షల కుటుంబాలకు ఈ లేఖలు చేరనున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఆసుపత్రులలో ఈ పథకం వర్తిస్తుందనే వివరాలు ఉన్నాయి. దీనికి కింద ఎటువంటి సౌకర్యాలు పొందవచ్చనేవి తెలియజేస్తూ 2 పేజీల లేఖలు పంపించారు.
ఈ పథకం కింద లబ్ధిదారులు చక్కగా చికిత్స చేయించుకోవచ్చనని, ఖర్చు గురించి ఎటువంటి ఆందోళన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోడీ ఈ లేఖలో పేర్కొన్నారు. 2018-19 బడ్జెట్లో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ పథకం తొలి ఆరోగ్య కేంద్రాన్ని మోడీ ఏప్రిల్ నెలలో ఛత్తీస్గఢ్లో ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5లక్షల వరకు బీమా కల్పిస్తారు. 10 కోట్లకు పైగా పేద కుటుంబాలు దీని వల్ల లబ్ధి పొందుతాయి. ఈ పథకం కోసం రూ.1200కోట్లను కేటాయించారు. సమగ్ర ఆరోగ్య సంరక్షణ కింద 1.5లక్షల కేంద్రాలను ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు అందిస్తారు.