సినిమా స్టైల్లో వచ్చారు.. గన్నులతో బెదిరించి బ్యాంకు దోచారు..!
రాంచీ : సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తున్నారా. సినిమా సన్నివేశాలను చూసి దొంగలు రెచ్చిపోతున్నారా. ఇలాంటి ప్రశ్నలకు రెండోది సమాధానంగా కనిపిస్తుందేమో. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన బ్యాంకు దోపిడీ జరిగిన తీరు చూస్తే సినిమా సీన్ తలపించింది. అచ్చు సినిమాల్లో చూపించే విధంగా బ్యాంకులో చొరబడ్డ దొంగలు అందినకాడికి దండుకుని పరారయ్యారు.
జార్ఖండ్ స్టేట్లో సినిమా సీన్ను తలదన్నేలా భారీ బ్యాంకు దోపిడీ జరిగింది. సినిమాలు బాగా ఫాలో అయ్యారో ఏమో గానీ చాలా వీజీగా దోపిడీకి పాల్పడ్డారు. ఛత్ర జిల్లా కేంద్రంలో సోమవారం నాడు ఉదయం జరిగిన బ్యాంక్ ఆఫ్ ఇండియా దోపిడీ కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఉదయం 9 గంటల 40 నిమిషాలకు నలుగురు దుండగులు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. ముఖాలకు ముసుగులు వేసుకుని బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం వెంట తెచ్చుకున్న పిస్టోళ్లు బయటకు తీసి అక్కడి సిబ్బందిని బెదిరించారు.
మందేసి.. ఎస్ఐకు ముద్దు పెట్టేసి.. హైదరాబాద్లో యువకుడి వింత చేష్టలు (వీడియో)
గన్నులు ఎక్కుపెట్టి బ్యాంకులో ఉన్న డబ్బంతా ఇవ్వాలంటూ ఆర్డరేశారు. తుపాకులను చూసేసరికి బ్యాంక్ సిబ్బందికి చెమటలు కారాయి. దాంతో చేసేదేమీ లేక దొంగలు చెప్పినట్లుగా విన్నారు. బ్యాంకులోని దాదాపు 23 లక్షల రూపాయలను బ్యాగుల్లో సర్దుకుని ఎంచక్కా చెక్కేశారు. అలా దర్జాగా వచ్చి ఇలా చోరీ చేసి వెళ్లిపోయిన ఘటన హాట్ టాపిక్ అయింది. ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా పని ముగించుకుని పరారయ్యారు.
దోపిడీ దొంగలు పారిపోయాక బ్యాంకు సిబ్బంది తేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగ ప్రవేశం చేశారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన వివరాలతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.