గర్భం దాల్చిన విద్యార్థిని: స్కూల్ అధికారులు దాష్టీకం
నాలుగో తరగతి విద్యార్థిని గర్భం దాల్చింది. దీంతో అబార్షన్ చేయించుకోవాలని పాఠశాల అధికారులు ఒత్తిడి తెచ్చి మాత్రలు మింగించారు.
న్యూఢిల్లీ: జార్ఖండ్లోని గర్వా జిల్లాలో నాలుగో తరగతి చదువుతున్న ఒక బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) చేయించుకోవాల్సిందిగా ఆ పాఠశాల అధికారులు ఆ చిన్నారిని ఒత్తిడి చేశారని వచ్చిన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి) ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ వార్తలను సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సి ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అలాగే బాధిత బాలికకు తగిన సహాయాన్ని అందజేయడంతోపాటు ఆమె సంరక్షణకు చేపట్టిన చర్యల వివరాలను తెలియజేయాలని కూడా జార్ఖండ్ ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు ఎన్హెచ్ఆర్సి వెల్లడించింది.
అబార్షన్ మాత్రలు వేసుకోవాల్సిందిగా బాలికపై పాఠశాల అధికారులు ఒత్తిడి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాల విద్యాలయలో ఈ సంఘటన జరిగింది. వైద్యుడిని సంప్రదించకుండా గర్భవిచ్ఛిత్తి మాత్రలు ఇవ్వడంతో బాలిక ఆరోగ్యం విషమించింది. దీంతో గర్వా సదర్ ఆస్పత్రికి బాలికను తరలించారు.
అప్పటికే బాలిక రెండు నెలల గర్భవతి అని తేలింది. దీంతో వైద్యులు అబార్షన్ చేసి బాలికను రక్షించారు. సవివరమైన నివేదిక సమర్పించాల్సిందిగా మానవ హక్కుల కమిషన్ జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటన జనవరి 24వ తేదీన జరిగింది. తల్లిదండ్రులు రెండు రోజుల ఆలస్యంగా సమాచారం అందిచారు. పాఠశాల అధికారులు సంఘటనపై నోరు విప్పడం లేదు. విచారణ జరగుతోందని, తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యశాఖ సూపరింటిండెంట్ అంటున్నారు.