అబ్దుల్ కలాంకు ముందే దండ వేసిన మంత్రి నీరా షాక్
రాంచీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోకు వారం రోజుల క్రితం దండ వేసిన జార్ఖండ్ మహిళా మంత్రి నీరా యాదవ్.. కలాం మృతి చెందిన విషయం తెలిసి షాక్కు గురయ్యారు. ఆయన మృతి పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కలాం లేరన్న వార్తను తాను నమ్మలేకపోతున్నానని చెప్పారు. తనకు అబ్దుల్ కలాం పైన అమితమైన గౌరవం ఉందని ఆమె చెప్పారు. షిల్లాంగ్లోని విశ్వవిద్యాలయంలో కలాం కుప్పకులారని తెలిసినప్పటి నుంచి తాను భగవంతుడిని ప్రార్థించానని చెప్పారు.
కలాం లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. అతను తనకు గురువు వంటి వారన్నారు. కలాంను కించపర్చాలనో లేదంటే మరో ఉద్దేశ్యమో తనకు లేదని ఆమె చెప్పారు. కలాం మృతికి వారం రోజుల ముందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన ఘటనను ఉద్దేశించి ఆమె చెప్పారు.
పాఠశాలలోని ఆ సంఘటన యాదృచ్ఛికంగా జరిగిందే అన్నారు. ఈ విషయమై తాను కలత చెందానని, గుండెలోతుల్లోంచి క్షమాపణలు చెప్పానని తెలిపారు. అబ్దుల్ కలాం మృతికి వారం రోజుల ముందు నీరా యాదవ్... ఓ పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. కలాం మృతి తర్వాత నెట్లో ఆమె పైన ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.