జార్ఖండ్ ఎన్నికల తుది ఫలితాలు.. ఎవరికి ఎన్నెన్ని సీట్లంటే.. సీఎం పదవి రేసులో..
Recommended Video
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని మూడు పార్టీల కూటమి విజయం సాధించి భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుండి అధికారాన్ని కైవసం చేసుకుంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సోమవారం ప్రకటించారు. కూటమి - జెఎంఎం-కాంగ్రెస్-ఆర్జెడి - 81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీలో 47 సీట్లు సాధించి ఘన విజయం సాధించింది.
నిన్నటి వరకు 37 సీట్లతో సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) 2019 జార్ఖండ్ ఎన్నికలలో 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యింది. జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాంతరిక్) మూడు నియోజకవర్గాలను గెలుచుకున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) ఒక్కో సీటు గెలుచుకున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత, బిజెపినేత , జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ గవర్నర్కు రాజీనామా చేశారు.
రాజీనామా చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇది తన ఓటమి అని , బీజేపీ ఓటమి కాదని ఆయన పేర్కొన్నారు. తాను గవర్నర్ ద్రౌపది ముర్మును కలుసుకున్నానని, తన రాజీనామాను సమర్పించానని ఆయన చెప్పారు .కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కేర్ టేకర్ సిఎంగా ఉండాలని గవర్నర్ నన్ను కోరారని రాంచీలోని రాజ్ భవన్ నుండి బయటకు వచ్చిన తరువాత రఘుబర్ దాస్ విలేకరులతో అన్నారు.రఘుబర్ దాస్ తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు కేర్ టేకర్ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సరయు రాయ్ చేతిలో ఆయన 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కౌంటింగ్ మొదట్లోనే కాంగ్రెస్-జెఎంఎం-ఆర్జెడి కూటమికి అధిక మెజారిటీని ఇవ్వడంతో, జెఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు . ప్రజా తీర్పుకు జార్ఖండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జెఎంఎం-కాంగ్రెస్-ఆర్జెడి కలయికకు జార్ఖండ్ ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని హేమంత్ సోరెన్ అన్నారు.ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు.హేమంత్ సోరెన్ 2019 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలైన బర్హైట్ మరియు డుమ్కా నుండి పోటీ చేసి, రెండింటినీ గెలుచుకున్నారు. దాంతో హేమంత్కు సీఎం పదవి చేపట్టడానికి మార్గం సుగమమైంది. బీజేపి చేజారిన రాష్ట్రాల జాబితాలో తాజాగా జార్ఖండ్ కూడా చేరింది.