కాషాయానికి కషాయ ఘాటు: జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి పాగా: ముఖ్యమంత్రి ఎవరో తేల్చేసిన కాంగ్రెస్..!
న్యూఢిల్లీ: జార్ఖండ్ లో రాజు ఎవరో..బంటు ఎవరో దాదాపు తేలిపోయినట్టే. అధికారాన్ని అందుకునేది ఎవరో.. ప్రతిపక్షానికి పరిమితమైనదెవరో స్పష్టమైనట్టే. కాంగ్రెస్ సంకీర్ణ కూటమి స్పష్టమైన మేజిక్ ఫిగర్ మార్క్ ను అందుకుంది. దానికి మించి మరో అయిదు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎలాంటి ప్లస్సులు, మైనస్సులు లేకుండానే కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైంది.
రౌండ్ టు రౌండ్: మళ్లీ ఆధిక్యంలో కాంగ్రెస్ కూటమి: కంఫర్టబుల్ గా..?
ముఖ్యమంత్రిగా హేమంత్..
స్పష్టమైన ఆధిక్యతను సాధించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ సంకీర్ణ కూటమి నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. దీనితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూటమి నాయకులు సన్నాహాలు కూడా అప్పుడే మొదలు పెట్టేశారు కూడా. ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పేరును ప్రకటించింది కాంగ్రెస్. తమ కూటమి ప్రభుత్వానికి హేమంతే నాయకత్వాన్ని వహిస్తారని జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు వెల్లడించారు. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
కూటమి నేతల్లో జోష్..
కాంగ్రెస్-జార్ఖండ్ ముక్తి మోర్చా-రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ శ్రేణులు, కార్యకర్తల సందడి మొదలైంది. సంకీర్ణ కూటమి కార్యకర్తలు బాణాసంచాను కాల్చుతూ పండగ వాతావరణాన్ని సృష్టించారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ పార్టీ కార్యాలయాల వద్ద కోలాహలం నెలకొంది. కాంగ్రెస్ కూటమి నేతల్లో జోష్ కనిపిస్తోంది. జార్ఖండ్ లోని 24 జిల్లాల్లో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆకాశాన్ని అంటేలా సందడి చేస్తున్నారు.
టార్గెట్ ను అందుకున్న కాంగ్రెస్ కూటమి..
తాజా ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 41ని అందుకుంది. దానికి మించి సీట్లను సాధించే దిశగా దూసుకెళ్తోంది. కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమికి చెందిన అభ్యర్థులు ప్రస్తుతతం 40 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ-30, జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం)-4, అఖిల జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజెఎస్యూ)-4 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. బీజేపీ ప్రస్తుతానికి 29 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
కమలానికి కషాయ ఘాటు..
వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న భారతీయ జనతా పార్టీ ఆశలు నిరాశలయ్యాయి. బీజేపీని ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న ప్రస్తుత సమయానికి బీజేపీ 29 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనపరుస్తోంది. ఇక పరిస్థితులు మెరుగు పడటానికి దాదాపు అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది. కాంగ్రెస-జేఎంఎం-ఆర్జేడీ కూటమి మేజిక్ ఫిగర్ ను అందుకున్న నేపథ్యంలో.. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవచ్చని అంటున్నారు.