జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే: అయిదు దశల్లో పోలింగ్..కౌంటింగ్ ఎప్పుడంటే..?
న్యూఢిల్లీ: మరో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొన్నటికి మొన్నే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీకి ఎన్నికల ప్రక్రియ ముగిసిన వారం రోజుల వ్యవధిలో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది. అయిదు దశల్లో జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించబోతున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. వచ్చేనెల 23వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు.
శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు అయిదు దశల్లో పోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. 23వ తేదీన ఓట్ల లెక్కింపును నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలు పెద్ద సంఖ్యలో ఉన్నందున.. అయిదు దశల్లో పోలింగ్ చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.
తొలి విడత పోలింగ్ ఈ నెల 30న నిర్వహిస్తారు. అనంతరం డిసెంబర్ 7, 12, 16, 20 తేదీల్లో చివరి నాలుగు విడతల్లో పోలింగ్ ను ముగిస్తారు. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. నిజానికి- హర్యానా, మహారాష్ట్రలతో పాటుగానే జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా.. మావోయిస్టు సమస్య అధికంగా ఉన్నందున,, భద్రతా పరమైన ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే వాయిదా వేశారు. ప్రస్తుతం జార్ఖండ్ లో భారతీయ జనతాపార్టీ అధికారంలో కొనసాగుతోంది. ఇక్కడ కూడా తాము మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.
బీజేపీ, అఖిల జార్ఖండ్ విద్యార్థుల యూనియన్ (ఏజేఎస్యూ) సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. ఈ సారి కూడా ఎన్నికల్లో ఈ రెండు కూటమిగా ఏర్పడి పోటీ చేయబోతున్నాయి. సీట్ల సర్దుబాటు ఎలా ఉండాలనేది ఇంకా తేలాల్సి ఉంది. 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ లో బీజేపీకి 35, ఏజెఎస్యూకు 17 సీట్లు ఉన్నాయి. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. మొత్తం 14 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 12 చోట్ల పాగా వేయగలిగింది. కాంగ్రెస్-జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కూటమి ఇక్కడ ప్రతిపక్ష స్థానంలో ఉంది.