రౌండ్ టు రౌండ్: మళ్లీ ఆధిక్యంలో కాంగ్రెస్ కూటమి: కంఫర్టబుల్ గా..?
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. రౌండ్ రౌండ్ కు ఆధిక్యత చేతులు మారుతూ వస్తోంది. ప్రారంభ ఫలితాల్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన కాంగ్రెస్-జార్ఖండ్ ముక్తి మోర్చా-రాష్ట్రీయ జనతాదళ్ సంకీర్ణ కూటమి ఆ తరువాత చతికిల పడింది. రెండో స్థానానికి పరిమితమైంది. భారతీయ జనతా పార్టీ, జార్ఖండ్ వికాస్ మోర్చా, అఖిల జార్ఖండ్ విద్యార్థి యూనియన్ దూసుకొచ్చేశాయి. బీజేపీ ఆధిక్యత ఎంతో సేపు నిలవలేదు.
రౌండ్.. రౌండ్ కూ చేతులు మారుతోన్న ఆధిక్యత..
లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్ సంకీర్ణ కూటమి అభ్యర్థులు మళ్లీ పైచేయి సాధిస్తూ వస్తున్నారు. చాలా చోట్ల ఆధిపత్యం, ఆధిక్యత చేతులు మారింది. మధ్యలో చాలా స్థానాల్లో వెనుకంజలో నిల్చున్న కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ అభ్యర్థులు మరోసారి పైచేయి సాధిస్తూ కనిపించారు. ఫలితంగా- కాంగ్రెస్ కూటమి అగ్రస్థానంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 41 స్థానాలను సొంతం చేసుకునే స్థితికి చేరుకుంది.
కాంగ్రెస్ వైపే బీఎస్పీ, సీపీఐ (ఎంఎల్ఎల్)
బీజేపీని విభేదిస్తూ వస్తోన్న బహుజన్ సమాజ్ పార్టీ, సీపీఐ (మార్క్సిస్టు-లెనినిస్టు)లు ఒకట్రెండు స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఈ రెండు పార్టీలను కూడా కలుపుకొని కాంగ్రెస్ కూటమి జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు మెరుగు పడ్డాయి. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థులు సైతం కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది. సాధారణంగా-స్వతంత్ర అభ్యర్థులు అధికారానికి దగ్గరయ్యే పార్టీ లేదా కూటమికే తమ మద్దతును ఇస్తుంటారు. అదే పరిస్థితి ఇక్కడా తలెత్తుతుందని అంటున్నారు.
మేజిక్ ఫిగర్ 41ని అందుకున్న కాంగ్రెస్
తాజా ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 41ని అందుకుంది. దానికి మించి సీట్లను సాధించే దిశగా దూసుకెళ్తోంది. కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమికి చెందిన అభ్యర్థులు ప్రస్తుతతం 40 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ-30, జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం)-4, అఖిల జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజెఎస్యూ)-4 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. వ్యత్యాసం చెప్పుకోదగ్గ స్థాయిలో లేనందున.. ఆధిక్యత చేతులు మారినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితి ఏర్పడింది.
సంపూర్ణ మెజారిటీ సాధిస్తేనే..
మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలం 41. ఈ మేజిక్ ఫిగర్ ను అందుకునే వారిదే అధికారం. ఆ ఛాన్స్ ఒక్క కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీకే ఉందంటూ జాతీయస్థాయిలో అన్ని ప్రధాన ఛానళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మహారాష్ట్ర తరహా ఎన్నికల వాతావరణం నెలకొనే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని అభిప్రాయపడ్డాయి. సంపూర్ణ మెజారిటీని సాధించే దిశలో కాంగ్రెస్ కూటమి కనిపిస్తోంది.