తప్పని కష్టాలు: లాలూ పెరోల్ పొడగింపునకు నో చెప్పిన జార్ఖండ్ హైకోర్టు
జార్ఖండ్ : ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు పెరోల్ పొడిగించేందుకు జార్ఖండ్ హైకోర్టు నిరాకరించింది. ఆగష్టు 30కల్లా తిరిగి జైలుకు చేరుకోవాలని ఆదేశించింది. తన ఆరోగ్యం సరిగ్గా లేనందున మరో మూడునెలల పాటు పెరోల్ పొడగించాలని లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
1990లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లాలూ దాణా స్కామ్కు పాల్పడారన్న ఆరోపణలు రుజువుకావడంతో ఆయనకు శిక్ష విధించింది కోర్టు. జైలులో ఉన్న లాలూ ఆరోగ్యం దెబ్బతినడంతో ఆయనకు పెరోల్ ఇచ్చింది కోర్టు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ ముంబైలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే తన చికిత్స కోసం మరో మూడునెలలు పెరోల్ పొడగించాలంటూ లాలూ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అప్రేష్ కుమార్ సింగ్ విచారణకు స్వీకరించారు. తుది వాదనలు విన్న ఆయన పెరోల్ పొడగించేది లేదని ఆగష్టు 30న లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు తిరిగి వెళ్లాలని తెలిపారు. అదేసమయంలో లాలూకు కావాల్సిన మెడికల్ కేర్ను రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిందిగా ఆదేశించారు.
లాలూ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. లాలూ ప్రసాద్ యాదవ్కు కిడ్నీలో రాళ్లు చేరాయని, ఇంక ఇతరత్ర ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నందున పెరోల్ పొడగించాలని అభిషేక్ సింఘ్వీ కోరారు. అభిషేక్ సింఘ్వీ అభ్యర్థన సరైంది కాదన్నారు సీబీఐ తరపున న్యాయవాది రాజీవ్ సిన్హా. ఇప్పటికే మూడునెలలు లాలూ తీసుకున్నారని చెప్పారు. అతనికి ఏదైనా చికిత్స అవసరమైతే రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తీసుకెళ్లొచ్చని రాజీవ్ సిన్హా తెలిపారు.
ఇదిలా ఉంటే మెడికల్ గ్రౌండ్స్ కింద కోర్టు లాలూకు ఆగష్టు 10 నుంచి ఆగష్టు 20 వరకు పెరోల్ పొడిగించింది. ఆ తర్వాత ఆగష్టు 17 నుంచి 27 వరకు మరోసారి పెరోల్ను పొడగిస్తూ ఆదేశాలిచ్చింది. లాలూ ఆరోగ్యం దెబ్బతినడంతో ఈ ఏడాది మే 11న ఆరువారాల పాటు కోర్టు పెరోల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.