మూకదాడి కేసును సీబీఐకి అప్పగించాలి: తబ్రేజ్ అన్సారీ భార్య డిమాండ్
రాంచీ: జార్ఖండ్లోని ధట్కిదిహ్ గ్రామంలో జూన్ 18న జరిగిన మూకదాడిలో మరణించిన తన భర్త కేసును సీబీఐచే విచారణ జరిపించాలని మృతుడు తబ్రేజ్ అన్సారీ(23) భార్య షియస్ట పర్వీన్ డిమాండ్ చేసింది. స్థానిక పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదని తెలిపింది.
తన భర్త మూకదాడిలో చనిపోతే.. గుండెపోటుతో చనిపోయారని ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించింది. తన భర్తను చంపిన 11మంది నిందితులపై పోలీసులు హత్యానేరం అభియోగాలను తొలగించారని ఆరోపించింది. నిందితులపై హత్య కేసు పెట్టాల్సిందేనని డిమాండ్ చేసింది.
మూకదాడిలో తన భర్త తీవ్రంగా గాయపడితే అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా జైలుకు ఎందుకు తీసుకెళ్లారని పోలీసులను నిలదీసింది. తన భర్త మరణానికి కారణమైన ప్రధాన నిందితుడికి మరణశిక్ష, దాడికి పాల్పడిన వారికి జీవిత ఖైదు పడేంత వరకు తాను పోరాటం చేస్తానని అన్నారు. తనకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వలేదని చెప్పారు.
తబ్రేజ్ అన్సారీ మూకదాడి కేసును నిష్పక్షపాతంగా విచారించామని, మెడికల్, పోస్టుమార్టం నివేదికల ఆధారంగానే తాము కేసు నమోదు చేశామని ఎస్పీ సెరాయికెల ఖర్సతవాన్ కార్తీక్ తెలిపారు. కాగా, అన్సారీ గుండెపోటు కారణంగానే మృతి చెందాడని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. జైశ్రీరాం, జై హనుమాన్ అని అనలేదనే కోపం ఈ మూకదాడి చేశారని నిందితులపై ఆరోపణలున్నాయి.
కాగా, తుది పోస్టుమార్టం రిపోర్టులో అన్సారీ గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు తేల్చారు. దీంతో పోలీసులు నిందితులపై హత్యా నేరం కింద కాకుండా హత్యాయత్నం కేసు పెట్టారు.