వాలెంటైన్స్ గిఫ్ట్: భార్య కోసం 28రోజులు సైకిల్పై వెదికాడు, ఎట్టకేలకు తన వద్దకు చేరిందిలా!
రాంచీ: అవును అతనికి మాత్రం ఫిబ్రవరి 14 నిజంగా వాలెంటైన్స్ డే సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే తన భార్య తన వద్దకు చేరుకుంది. దాదాపు నెల రోజులుగా వెతుకుతుండగా.. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14కు రెండ్రోజుల ముందే ఆమె అతన్ని చేరుకోవడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్భమ్ జిల్లాకి చెందిన మనోహర్ అనే వ్యక్తి కూలీగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య అనిత నెల రోజుల క్రితం(జనవరి 11న) కన్పించకుండాపోయింది.
సైకిల్పై 750కి.మీలు
ఎక్కడికి వెళ్లిపోయిందో తెలీక మనోహర్ తన సైకిల్పైనే ఏకంగా 750 కిలోమీటర్లు, 55 గ్రామాల్లో వెతికాడు. స్థానిక ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో తన భార్య ఫొటో ఇచ్చి ఫిర్యాదు కూడా చేశాడు.
ఆనందంలో మనోహర్
కాగా, ఆదివారం పోలీసులు మనోహర్కు ఫోన్ చేశారు. వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డులు తన భార్య ఆధార్ కార్డు తీసుకురావాల్సిందిగా కోరారు. మనోహర్ స్టేషన్కు వెళ్లేసరికి అక్కడ తన భార్య ఉండడం చూసి ఆనందం వ్యక్తం చేశాడు. భార్య కోసం అంతగా వెతికిన మనోహర్ ఎట్టకేలకు ఆమెను చేరుకోగలిగాడని ఇందుకు తమకు కూడా చాలా సంతోషంగా ఉందని పోలీసులు తెలిపారు.
చేపల కోసం వెళ్లానంటూ..
ఆమెను పశ్చిమబెంగాల్ సరిహద్దు గ్రామంలో గుర్తించామని చెప్పారు. అనిత మానసిక సరిస్థితి సరిగా లేదని.. అందుకే ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో చేపలు పట్టడానికి వెళ్లానని చెబుతోందని పోలీసులు మనోహర్కు చెప్పారు.
పోలీసులకు ధన్యవాదాలు
దీంతో తన భార్యకు మెరుగైన చికిత్స చేయిస్తానని మనోహర్ తెలిపాడు. తన భార్యను సురక్షితంగా అప్పగించిన పోలీసులకు మనోహర్ ధన్యవాదాలు తెలిపాడు. కాగా, అనిత(35)తో మనోహర్(46)కు 2001లో వివాహమైంది.