పాఠశాల సమీపంలో ఘోరం: టీచర్ తల నరికి, 5కి.మీ పరుగెత్తాడు
జంషెడ్పూర్: జార్ఖండ్ రాష్ట్రంలోని సెరైకెలా-ఖరస్వాన్ జిల్లాలో ఓ మానసిక వికలాంగుడు దారుణానికి పాల్పడ్డాడు. ఓ ఉపాధ్యాయురాలిని ఆమె పనిచేస్తున్న పాఠశాల సమీపంలోనే దారుణంగా హత్య చేశాడు. ఆమె తలను వేరు చేయడంతోపాటు దాన్ని పట్టుకుని.. పోలీసులు, గ్రామస్తులకు దొరక్కుండా 5 కి.మీ పరుగెత్తాడు.
మధ్యాహ్నం భోజన సమయంలో దారుణం
పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన జరిగిందని స్థానిక పోలీసు అధికారి అవినాశ్ కుమార్ తెలిపారు. ఘటన జరిగిన రెండు గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేశామని చెప్పారు.
నిందితుడికి మతిస్థిమితం లేదు
నిందితుడ్ని హరి హెంబ్రమ్(26)గా గుర్తించినట్లు తెలిపారు. మతిస్థిమితం సరిగా లేని హరి హెంబ్రమ్ గత కొంతకాలంగా పాఠశాల సమీపంలోనే ఒంటరిగా ఉంటున్నాడని తెలిపారు.
పాఠశాల నుంచి ఈడ్చుకెళ్లి.. ఘోరం
కాగా, మంగళవారం మధ్యాహ్నం అక్కడి పాఠశాలలో పనిచేస్తున్న సుక్ర హేసా(30)ను పాఠశాలలోకి వెళ్లి ఈడ్చుకొచ్చాడు హరి హెంబ్రమ్. ఆ తర్వాత అతని ఇంటి వైపు లాక్కెళ్లి పెద్ద కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆ తర్వాత ఆమె తలను వేరు చేశాడు. విద్యార్థులు, స్థానికులు అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అక్కడ్నుంచి ఆమె తలతో పారిపోయాడు.
చితకబాదిన స్థానికులు
అతడ్ని వెంబడించిన స్థానికులు.. అతడ్ని పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను అడ్డుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.