జగన్ కంటే ఓ అడుగు ముందుకే: మూడు ప్రాంతాల్లో నాలుగు రాజధానులు..త్వరలో కేబినెట్కు !
రాంచి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం.. సతమతమౌతోంది. దీనికోసం ప్రవేశపెట్టిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును ఆమోదించకపోవడం వల్ల ఏకంగా శాసన మండలినే రద్దు చేయడానికి తీర్మానాన్ని శాసనసభ ఆమోదించాల్సి వచ్చింది. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా ప్రతిఘటనను ఎదుర్కొంటుండగా.. జార్ఖండ్ మాత్రం ఓ అడుగు ముందే ఉంది.
నాలుగు రాజధానుల ఏర్పాటు దిశగా..
ఏకంగా నాలుగు రాజధానులను ఏర్పాటు చేయబోతోంది అక్కడి హేమంత్ సోరెన్ సర్కార్. ఇప్పుడున్న రాంచిని కూడా కలుపుకొంటే మొత్తం రాజధానుల సంఖ్య అయిదుకు చేరుకుంటుందక్కడ. దుమ్కా, మేదినినగర్, ఛైబాస, గిరిధ్ ప్రాంతాలను రాజధానులను బదలాయించడానికి జార్ఖండ్ ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అనుకున్నది అనుకున్నట్టుగా అమల్లోకి వస్తే.. దేశంలో నాలుగు రాజధానులను కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. జార్ఖండే అవుతుంది. వీటిలో దుమ్కా.. ఇదివరకే ఉప రాజధానిగా కొనసాగుతోంది. దీన్ని పూర్తిస్థాయిలో రాజధానిగా బదలాయించనుంది.
అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే..
గిరిజనులు, ఆదివాసీల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రం జార్ఖండ్. అభివృద్ధిలో మిగిలిన ఉత్తరాది రాష్ట్రాలతో పోటీ పడలేకపోతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు రాజధానులను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని జార్ఖండ్ ప్రభుత్వం చెబుతోంది. కొత్తగా రాజధానులను ఏర్పాటు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని, అభివృద్ధిని వికేంద్రీకరించినట్టవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
త్వరలో కేబినెట్ సమక్షానికి..
ఆంధ్రప్రదేశ్ తరహాలోనే అక్కడా మూడు ప్రాంతాలు ఉన్నాయి. పాలము, కొల్హన్, నార్త్ ఛోవానగర్ డివిజన్లుగా వాటిని విభజించారు. మూడు ప్రాంతాల్లో నాలుగు నగరాలను ఎంపిక చేసింది జార్ఖండ్ ప్రభుత్వం. నాలుగు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని, వచ్చేనెల మొదటి లేదా రెండో వారంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన ఏర్పాటయ్యే మంత్రివర్గ సమావేశం సమక్షానికి ఈ ప్రతిపాదనలు రానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం తెలిపిన వెంటనే- శాసనసభలో బిల్లును ప్రవేశపెడతారని అంటున్నారు.