రేపిస్టును చంపేసి శవాన్ని ఇంట్లో పెట్టిన స్త్రీ
రాంచీ: తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై ఓ మహిళ దారుణంగా కక్ష తీర్చుకుంది. తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని హత్య చేసి ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయింది. జార్ఖండ్లోని రాంచీలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు ఈ విషయాన్ని శుక్రవారంనాడు వెల్లడించారు.
బాధితురాలు ఇళ్లలో పనిచేసుకుంటూ స్థానిక హౌసింగ్ సొసైటీలో నివసిస్తోంది. బుధవారం తెల్లవారు జామును ఇంట్లోకి చొరబడిన మనోజ్ కుమార్ (24) ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో తన చేతికి అందిన సుత్తితో అతడి తలపై ఆమె బలంగా కొట్టింది.
తీవ్రమైన ఆగ్రహంతో అతని ముఖాన్ని ఛిద్రం చేసింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఆ మర్నాడు ఉదయం మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి యధావిధిగా పనికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఏమనుకుందో గానీ అదే రోజు రాత్రి స్థానిక ఆర్గోరా పోలీసు స్టేషన్లో లొంగిపోయింది. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. మృతుడు మనోజ్ కుమార్, బాధితారులు ఇద్దరు కూడా కుంటి జిల్లాలోని అంబా టోలీ గ్రామానికి చెందినవారు.