ముగ్గురికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించిన జాన్సన్ అండ్ జాన్సన్..ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన ఉత్పత్తులు వాడి ప్రాణాలమీదకు తెచ్చుకున్న ముగ్గురికి ఆ సంస్థ రూ. 25 లక్షలు పరిహారంగా చెల్లించింది. ఉత్తర్ ప్రదేశ్లో హిప్ ఇంప్లాంట్స్కు సంబంధించి నకిలీ పరికరాలను జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ సరఫరా చేసింది. వాటినే బాధితులకు వైద్యులు అమర్చారు. అయితే అవి అమర్చిన తర్వాత కొత్త జబ్బులు తలెత్తడంతో వైద్యులు మళ్లీ పరిశీలించగా అసలు విషయం వెలుగు చూసింది.
తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఏడాది మేలో బాధితులకు ఒక్కొక్కరికీ రూ. 25 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థను ఆదేశించింది. ఇలా మొత్తం 67 మంది పేషెంట్లకు చెల్లించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ముగ్గురు పేషెంట్లకు డబ్బులు చెల్లించిందని ఉత్తర్ ప్రదేశ్ డ్రగ్ లైసెన్సింగ్ మరియు కంట్రోల్ ఆఫీసర్ ఏకే జైన్ తెలిపారు.
అంతకుముందు ఒక్కొక్కరికీ రూ. 65 లక్షలు, రూ.74 లక్షలు పరిహారంగా చెల్లించాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ. అంత డబ్బు చెల్లించలేమని చెబుతూ ఒక్కొక్కరికీ రూ. 25 లక్షలు పరిహారంగా చెల్లిస్తామని కోర్టుకు తెలిపింది. అయితే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ బారిన పడిన పేషెంట్ల జాబితాను సమర్పించాల్సిందిగా కోర్టు కోరింది. జాబితాను పరిశీలించిన కోర్టు బాధితులకు రూ. 25 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆ డబ్బులను పేషెంట్లకు చెల్లించినట్లు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తెలిపింది.