జియాఖాన్ మృతి: అమెరికా సాయం! హత్య కోణంలో...
ముంబై: బాలీవుడ్ నటి జియాఖాన్ మృతి కేసులో ఆమె తల్లి రబియా ఖాన్ (59) అమెరికా సహాయం కోరారు. జియాఖాన్ అమెరికా సిటిజన్. దీంతో ఆమె ఆ దేశం సాయం కోరింది. జియాఖాన్ మృతిపై హత్య కోణంలో విచారించేందుకు ముంబై పోలీసులు నిరాకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.. జియాఖాన్ది హత్య అనేందుకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని పోలీసులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ)కు లేఖ రాశారు. ముంబై పోలీసులు జియాఖాన్ మృతిపై న్యాయస్థానంలో ఛార్జీషీట్ దాఖలు చేశారు. సూరజ్ పంచోలీ ప్రేరేపించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని ఛార్జీషీటులో పేర్కొన్నారు. రబియా మాత్రం హత్య కోణంలో దర్యాఫ్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బుధవారం ఉదయం తనకు ఓ మెయిల్ వచ్చిందని రబియా ఖాన్ చెప్పారు. జియాఖాన్ మృతి కేసులో సిబిఐకి, ముంబై పోలీసులకు సాయం చేస్తామని ఎఫ్బిఐ లేఖ రాసిందని చెప్పారు. అయితే, దీనికి మన అధికారులు అనుమతిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు ముంబై హైకోర్టుకు వెళతానని కూడా రబియా ఖాన్ బుధవారం చెప్పారు. జియాఖాన్ మృతిని హత్య కోణంలో దర్యాఫ్తు చేయడంలేదని ఆరోపించారు.
కాగా, జియాఖాన్ మృతి కేసులో న్యాయస్థానంలో ఛార్జీషీట్ దాఖలు చేసిన ముంబై పోలీసులు.. ఆమెను ప్రియుడు సూరజ్ పంచోలీయే ఆత్మహత్యకు ప్రేరేపించాడని పేర్కొన్నారు. 447 పేజీల ఛార్జీషీటును పోలీసులు ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు.
మొత్తం 22 మంది సాక్ష్యాలను అందులో పేర్కొన్నారు. జియాఖాన్కు గర్ఫస్రావం చేసిన వైద్యులు, ఆమె నివసించే భవనం వాచ్మెన్, సూరజ్ నివాసంలోని పనిమనుషులు, స్నేహితుల సాక్ష్యాలను అభియోగ పత్రంలో పేర్కొన్నారు. గత ఏడాది జూన్ 3వ తేదీన జియాఖాన్ ఉరేసికొని ఆత్మహత్య చేసుకున్నారు.