టెక్కీ జిగీషా పాశవిక హత్య: దోషులకు మరణశిక్ష
న్యూఢిల్లీ: ఏడేళ్ల క్రితం(2009) జరిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని జిగీషా ఘోష్ హత్య కేసులో ఇద్దరు నేరస్తులకు మరణశిక్ష విధించారు. మూడో నేరస్తుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పును వెలువరించింది. 28ఏళ్ల జిగీషా ఘోష్ అనే ఐటి ఉద్యోగినిని 2009లో అత్యంత భయానకరీతిలో దారుణ హత్యకు గురైంది.
ఆ హత్య పాశవితకతకు, అమానుషత్వానికి పరాకాష్టగా నిలిచిందని, దీన్ని అత్యంత హేయమైన హత్యగా పరిగణిస్తూ దోషులైన రవికపూర్, అమిత్ శుక్లాలకు మరణశిక్ష, మూడో దోషి బల్జీత్ మాలిక్కు జైలులో సత్ప్రవర్తన కారణంగా యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు విధించింది.
మరణశిక్షతోపాటు రవికపూర్కు రూ. 1.2 లక్షలు, శుక్లాకు రూ. 2.8 లక్షలు, బల్జీత్ మాలిక్కు రూ. 5.8 లక్షల జరిమానా విధించింది. రవికపూర్కు తక్కువ జరిమానా విధించడానికి కారణం అతడికి ఆర్థిక స్తోమతలేకపోవడమేనని కోర్టు స్పష్టం చేసింది.
'ఐటీ ఉద్యోగిని జిగిషా ఘోష్ను ఈ ముగ్గురు కొన్ని గంటలపాటు నిర్బంధించారు. తనను చంపవద్దంటూ ఆమె బతిమాలారు. డెబిట్ కార్డుతోసహా అన్నీ వారికి ఇచ్చేశారు. పిన్ నెంబర్ కూడా ఇచ్చారు. అయినా ముగ్గురూ సంతృప్తి చెందలేదు. అత్యంత రాక్షసత్వాన్ని వారు ప్రదర్శించారు. వీరిపై ఎలాంటి కనికరాన్ని కనబర్చాల్సిన అవసరమేలేదు' అంటూ న్యాయమూర్తి సందీప్ యాదవ్ తీర్పులో పేర్కొన్నారు.
కాగా, జిగీషా హత్యకు ఏడాది ముందు జరిగిన టీవీ జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్ హత్య కేసులో కూడా ఈ ముగ్గురు విచారణను ఎదుర్కొంటున్నారు.