పెళ్ళికి నిరాకరించాడని యాసిడ్ పోసి... ఆపైన బ్లేడుతో...
పెళ్ళి చేసుకునేందుకు నిరాకరించాడనే కోపంతో ఓ యువకుడిపై యాసిడ్ తో దాడి చేసిన ఓ యువతి.. అప్పటికీ కోపం చల్లారక షేవింగ్ బ్లేడుతో ముఖంపై చెక్కేందుకు ప్రయత్నించింది.
బెంగళూరు: పెళ్ళి చేసుకునేందుకు నిరాకరించాడనే కోపంతో ఓ యువకుడిపై యాసిడ్ తో దాడి చేసిన ఓ యువతి.. అప్పటికీ కోపం చల్లారక షేవింగ్ బ్లేడుతో ముఖంపై చెక్కేందుకు ప్రయత్నించింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి, ఆ యువతిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సోమవారం రాత్రి బెంగళూరులో చోటుచేసుకున్న ఈ ఘటన మంగళవారం వెలుగులోనికి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరులోని శ్రీరాంపురానికి చెందిన విద్య(26) ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. శ్రీరాంపురానికే చెందిన వస్త్ర వ్యాపారి జయకుమార్(30)ను ఇష్టపడింది. ఇద్దరూ గత నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు.
తనను పెళ్లి చేసుకోవాలని విద్య అతడిని ఒత్తిడి చేయసాగింది. జయకుమార్ ఇందుకు నిరాకరించాడు. అంతేకాకుండా అతడు ఇంకెవరినో పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలియడంతో ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
సోమవారం రాత్రి పైప్ లైన్ రోడ్డులో జయకుమార్ ను అడ్డగించి అతడిపై యాసిడ్ చల్లింది. అంతటితో ఆగక షేవింగ్ బ్లేడుతో అతడి ముఖంపై గాయపరిచింది. జయకుమార్ కేకలు వేయడంతో చుట్టుపక్కల జనం అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన అతడిని కేసీ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రి వైద్యులు సమాచారం ఇవ్వడంతో విజయనగర్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నర్సు విద్యను మంగళవారం అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.