పెళ్లి మండపంలో వధువు కిడ్నాప్కు యత్నం: విషం తాగిన ప్రేమికుడు
కృష్ణగిరి: తమిళనాడులోని కృష్ణగిరిలో చోటు చేసుకున్న ఓ సంఘటన సినిమా కైమాక్స్ను తలపించింది. కాసేపట్లో పెళ్లి మండపంలో ఉన్న వధూవరులకు వివాహం జరుగుతుందనగా.. హఠాత్తుగా ఓ యువకుడు వచ్చి.. తాను వధువును ప్రేమించానని, ఆమెను పెళ్లి చేసుంటానని తెలిపాడు.
అంతటితో ఆగకుండా ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో వధువు బంధవులు అతని దేహశుద్ధి చేశారు. అయినా అక్కడ్నుంచి కదలకుండా వెంట తెచ్చుకున్న విషాన్ని తాగేశాడు. ఈ ఘటనతో పెళ్లికి హాజరైన జనాలు విస్తుపోయారు.
వివరాల్లోకి వెళితే... కృష్ణగిరిలోని ఓ కళ్యాణ మండపంలో వరుడు రమేష్(25), వధువు అనిత(19) పెళ్లి పీటలపై కూర్చునేందుకు సిద్ధమయ్యారు. అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో ఆ జంట వివాహ మండపంపైకి వచ్చారు. ఇంతలోనే వధువును ప్రేమించానంటూ మాదేశ్(23) అనే యువకుడు అక్కడికి చేరుకున్నాడు.
ఆ తర్వాత వధువును కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. కుదరకపోవడంతో తన వెంట తెచ్చుకున్న మంగళసూత్రాన్ని ఆమె మెడలో కట్టేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న ఆమె బంధువులు అతడ్ని చితకబదారు. ఇంత జరిగినా అక్కడ్నుంచి కదలకుండా తాను ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటానని పట్టుబట్టాడు. ఆమెకు పెళ్లి జరిగితే తనతోనే జరగాలని పట్టుపట్టాడు.
వధువు బంధువులు అతడ్ని అక్కడ్నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో తన వెంట తెచ్చుకున్న విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు మాదేశ్. ఈ ఘటనతో అనిత, రమేష్ల వివాహం ఆగిపోయింది. అయితే మరో అమ్మాయి దివ్య(20)తో రమేష్ వివాహం జరిగింది.
అయితే పెళ్లి మండపం వద్ద ఇంత రాద్దాంతం చేసిన మాదేశ్.. అసలు అనితను ప్రేమిస్తున్నాడా? లేదా అన్నది తేలాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం మాదేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిసింది.