ప్రియురాలి గొంతు కోసి పరారవుతుండగా వాహనం ఢీకొని మృతి
ముంబై: ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని కత్తితో పొడిచిన నిమిషాల్లోనే అతను ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ముంబైలోని దహిశార్ (ఈస్ట్) ప్రాంతంలో సోమవారం రాత్రిపూట జరిగింది. అతని వయస్సు 23 ఏళ్లు. బాలిక వయస్సు 17 ఏళ్లు.
అతను తాను వెంట తెచ్చుకున్న కత్తితో బాలికను దారుణంగా పొడిచాడు. ఆమెకు పదమూడు స్టిచ్చెస్ పడ్డాయి. ప్రస్తుతం ఆమె ఓ ప్రయివేటు ఆసుపత్రిలోని ఐసీసీయూలో చికిత్స పొందుతోంది. అనిల్ దండేకర్ అనే వ్యక్తి ఆటో తోలుతూ జీవనం సాగిస్తున్నాడు. అక్కడే బాధితురాలు కూడా ఉంటోంది.
బాలిక, అతను రెండేళ్లుగా ఒకరికి ఒకరు తెలుసు. వారిద్దరు ప్రేమించుకుంటున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే, వారిద్దరు ఒకరికి మరొకరు తెలుసుననే విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులు కొట్టి పారేశారు. దండేకర్ది వన్ సైడ్ లవ్ అని చెబుతున్నారు.
గోరేగావ్ కళాశాలలో చదువుతున్న ఆ బాలిక సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ట్యూషన్ కోసం వెళ్లింది. ఏడు గంటలకు ట్యూషన్ అయిపోయింది. ఆమె ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చింది. దండేకర్ అక్కడే తన ఆటోతో బయట నిలబడ్డాడు. ఆటోలో ఇంటి వద్ద దింపుతానని చెప్పాడు.
ఆమె ఆటో ఎక్కిన తర్వాత దానిని వెస్టెర్న్ ఎక్స్ప్రెస్ హైవే వైపు వెళ్లాడు. వారిద్దరు మాట్లాడుకున్నారు. అంతలోనే వాగ్వాదం జరిగింది. సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో దండేకర్ ఆటోను ఓ ఎంఎన్ఎస్ ఆఫీస్కు దగ్గరలో ఆపాడు. తనతో తెచ్చుకున్న కత్తిని బయటకు తీసి బాలికను పొడిచాడు. ఆమె దవడ, గొంతు తదితర చోట్ల నాలుగుసార్లు పొడిచాడు. ఆమెకు రక్తం రావడంతో భయపడిన అతను ఆటో వదిలి అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేశాడు.
అతను ఆ హడావుడిలో రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న ఓ వాహనం వచ్చి అతనిని బలంగా గుద్దింది. ఆ వాహనం డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ దండేకర్ అక్కడికి అక్కడే మృతి చెందాడు. 9.30 గంటల సమయంలో అంబులెన్స్ వచ్చి అతనిని ఆసుపత్రికి తీసుకు వెళ్లింది. పక్కనే ఆటోలో గాయాలతో పడి ఉన్న బాలికను చూసి స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అనంతరం ఆమెను అత్యుత్తమ చికిత్స కోసం ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక మాట్లాడే పరిస్థితిలో లేదు. దీంతో ఆమె సోదరి వాంగ్మూలం తీసుకున్నారు. అలాగే, దండేకర్ను గుద్దిన వాహనం డ్రైవర్ పైన కేసు పెట్టారు. దానిని గుర్తించే పనిలో పడ్డారు.