జిమెక్స్ 2020 ప్రారంభం.... అరేబియా సముద్రంలో భారత్-జపాన్ సంయుక్త నౌకాదళ విన్యాసాలు
భారత్, జపాన్ దేశాల సంయుక్త నౌకాదళ విన్యాసాలు (జిమెక్స్-2020) శనివారం(సెప్టెంబర్ 26) నుంచి ప్రారంభం కానున్నాయి. జిమెక్స్ 4వ ఎడిషన్లో భాగంగా సెప్టెంబర్ 26 నుండి 28 వరకు ఉత్తర అరేబియా సముద్రంలో ఈ విన్యాసాలు జరగనున్నాయి. భారత నావికాదళం, జపనీస్ మెరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్డీఎఫ్) మధ్య ద్వైవార్షికంగా జరిగే జిమెక్స్(JIMEX) కార్యక్రమం పరస్పర యుద్ధ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు ఇరు దేశాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించేందుకు దోహదపడనుంది.
జిమెక్స్ కార్యక్రమంతో భారత్-జపాన్ మధ్య నేవీ కోఆపరేషన్ బలపడింది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లకు ఇరు దేశాల ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలపై కూడా ఇందులో చర్చిస్తూ వస్తున్నారు. వెపన్ ఫైరింగ్,క్రాస్ డెక్ హెలికాప్టర్ ఆపరేషన్స్,యాంటీ సబ్ మెరైన్,ఎయిర్ వార్ఫేర్ డ్రిల్స్ తదితర అంశాల్లో జిమెక్స్ ద్వారా ఇరు దేశాలు పరస్పర సహాయ సహకారాలను అందించుకుంటున్నాయి.
తాజా జిమెక్స్-2020లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆపరేషన్స్కు ప్రణాళిక రూపొందించారు. ఈసారి కరోనా నేపథ్యంలో నాన్-కాంటాక్ట్-ఎట్-సీ-ఓన్లీ ఫార్మాట్ విధానంలో మాత్రమే విన్యాసాలను నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాల్లో భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ చెన్నై,ఐఎన్ఎస్ టెగ్,ఐఎన్ఎస్ దీపక్ నౌకలు పాల్గొననున్నాయి.
Recommended Video
జపాన్ మెరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ తరుపున కగా,ఇజుమో,ఇకజుచి నౌకలు పాల్గొనున్నాయి. చివరిసారిగా 2018లో నిర్వహించిన జిమెక్స్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగింది. ఐఎన్ఎస్ సాత్పుర, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ కద్మత్ ఇందులో పాల్గొన్నాయి. వీటితోపాటు ఒక జలాంతర్గామి, లాంగ్ రేంజ్ మెరీటైం పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్, పలు హెలికాప్టర్లు పాల్గొన్నాయి.