కనెక్టివిటీలో అదే మొదటి స్థానం..! ఆ జియో టన్ ట నాటన్..!!
ఢిల్లీ/హైదరాబాద్ : భారత్ లో జియో నెట్ వర్క్ రాజ్యమేలుతోంది. దాని కన్నా ఎంతో కాలం ముందోచ్చిన నెట్ వర్క్ లను తోసిరాజంటూ కెనెక్టివిటీలో అగ్రస్థానానికి చేరుకుంది. రిలయన్స్ జియో అత్యధిక వేగం 4జీ సేవలతో టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ, అంతే వేగంతో మొబైల్ కనెక్షన్ల పరంగా దేశంలో అగ్రస్థానాన్ని మూడేళ్లలోపే అధిరోహించింది. జూన్లో 33.13 కోట్ల మొబైల్ కనెక్షన్లతో జియో ఈ ఘనత సాధించింది.
వాణిజ్య సేవలను ఆరంభించి (2016 సెప్టెంబరు) మూడేళ్లు కూడా పూర్తికాకముందే, దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్ జియో అవతరించింది. ఈ ఏడాది జూన్లో జియో కనెక్షన్లు 33.13 కోట్లు కాగా, వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు 32 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఆయా సంస్థల ఆర్థిక ఫలితాల్లోనే ఈ గణాంకాలు నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో 33.41 కోట్ల కనెక్షన్లు వొడాఫోన్ ఐడియాకు ఉండగా, జూన్ త్రైమాసికం చివరకు కనెక్షన్లు 32.0 కోట్లకు పరిమితమైనట్లు ఆ సంస్థ వెల్లడించింది.
ప్రతినెలా కనీస రీఛార్జి చేసుకుంటేనే, ఇన్కమింగ్ సేవలు లభిస్తాయనే షరతు విధించడం వల్లే కనెక్షన్లు తగ్గాయని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. వాస్తవానికి వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థల విలీనంతో ఏర్పాటైన వొడాఫోన్ ఐడియాకు 40 కోట్లకు పైగా కనెక్షన్లతో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించినా, ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ప్రతినెలా చందాదార్లను కోల్పోతూ రావడం వల్లే, ప్రస్తుతం రెండోస్థానానికి పరిమితమైంది.
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో గత మే నెలలోనే భారతీ ఎయిర్టెల్ను అధిగమించి, రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది. మే నెలలో 32.29 కోట్ల కనెక్షన్లతో 27.80 మార్కెట్ వాటాను సంస్థ సాధించిందని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ నెలలో ఎయిర్టెల్ కనెక్షన్లు 32.04 కోట్లు కాగా, 27.6 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది.