జియో డీటీహెచ్ సంచలన ఆఫర్?: ఇక్కడ కూడా హవా మొదలైనట్టే!..
ముంబై: ఇదే గనుక నిజమైతే టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం డీటీహెచ్(డైరెక్ట్-టు-హోమ్) రంగాన్ని కూడా తాకనుంది. త్వరలోనే డీటీహెచ్ రంగంలోకి అడుగుపెట్టనున్న జియో.. అతి తక్కువ ప్యాకేజీకే ఎక్కువ టీవి చానెళ్లను అందించే ఆఫర్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రచారం జరుగుతోంది.
కేవలం రూ.200కే ఎస్ డి(స్టాండర్డ్ డెఫినిషన్), రూ.400కి ఎస్ డి+హెచ్ డి(హై డెఫినిషన్) చానెల్స్ అందించనున్నట్టు సమాచారం. లేటెస్ట్ మల్టీమీడియా బ్రాడ్కాస్ట్ మల్టీకాస్ట్ సర్వీస్(ఈఎంబీఎంఎస్) కింద ఈ జియో హోమ్ టీవి సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.
ఇటీవలే దీనికి సంబంధించిన టెస్టింగ్ కూడా పూర్తయినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. ఎంపిక చేసిన కొన్ని డివైజ్ లలో ఈఎంబీఎంఎస్ ద్వారా హెచ్ డి ప్రసారాలను ఇటీవలే పరీక్షించారట. టెలికాం రంగంలో జియో దెబ్బకు మిగతా సంస్థలు ఎలాగైతే కుదేలయ్యాయో.. త్వరలో డీటీహెచ్ రంగంలోనూ అదే జరగబోతుందని పరిశీలకులు అంటున్నారు.
కాగా, ఈఎంబీఎంఎస్.. ఓ హైబ్రిడ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఒకే సారి పెద్ద మొత్తంలో యూజర్లను పొందగలదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో త్రైమాసికంలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.