జియో 4జీ ఫోన్: షాకింగ్ నిబంధనలు.. భగ్గుమంటున్న కస్టమర్లు
రిలయన్స్ జియో ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది రిలయన్స్ జియో. జియో 4 జీ ఫోన్ కు సంబంధించి నిబంధనలు, షరతులను సంస్థ తాజాగా ప్రకటించింది.
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది రిలయన్స్ జియో. జియో 4 జీ ఫోన్ కు సంబంధించి నిబంధనలు, షరతులను సంస్థ తాజాగా ప్రకటించింది.
కస్టమర్లపై ఆశలపై నీళ్లు చల్లుతూ కొన్ని షాకింగ్ నిబంధనలు, తప్పనిసరి రీచార్జ్ల బాదుడుకు శ్రీకారం చుట్టింది. కనీస రీఛార్జిలు, ఫోన్ రిటర్న్ విధానాన్ని కంపెనీ తన వెబ్సైట్ లో పేర్కొంది.
ముఖ్యంగా జియో 4 జీ ఫీచర్ ఫోన్ కొనుగోలు సందర్భంగా కస్టమర్ డిపాజిట్ చేసిన రూ.1500 సొమ్ము తిరిగి పొందాలంటే మూడు సంవత్సరాల్లో కనీసం రూ.4500 విలువైన రీచార్జ్ చేసుకోవాలి. ఇది తప్పనిసరి. లేదంటే .. వినియోగదారుడికి భారీ నష్టం తప్పదు.
అంతేకాదు, వినియోగదారులు మూడు నెలల పాటు ఎలాంటి రీచార్జ్లు చేసుకోకుండా ఉంటే రావాల్సిన రిఫండ్ మనీ రూ.1500 వెనక్కి రాదు. అలాగే మూడేళ్ల పాటు సంవత్సరానికి కచ్చితంగా రూ.1500 (మొత్తం రూ.4500) విలువైన రీచార్జ్ కచ్చితంగా చేసుకోవాలి.
ఒకవేళ మధ్యలోనే జియో ఫోన్ వెనక్కి ఇచ్చేయాలని ప్రయత్నిస్తే మరో బాదుడు భరించాల్సిందే. ఎందుకంటే ఫోన్ వెనక్కి ఇచ్చేయాలనుకున్న వారు అదనంగా పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఫోన్ కొన్నప్పటి నుంచి 12 నెలల లోపు దాన్ని వెనక్కి ఇచ్చేయాలనుకుంటే రూ.1500 , ప్లస్ జీఎస్టీ పెనాల్టీగా చెల్లించాలి. ఒకవేళ మొదటి సంవత్సరం వాడుకుని రెండో సంవత్సరం దాన్ని రిటర్న్ చెయ్యాలనుకుంటే రూ.1000 రూపాయలు ఫైన్ ప్లస్ జీఎస్టీ పెనాల్టీగా చెల్లించాలి.
ఇక మూడో సంవత్సరంలో 36 నెలలు పూర్తయ్యే లోపు జియో ఫోన్ ను వెనక్కి ఇచ్చేయాలనుకున్నట్లయితే.. రూ.500 ఫైన్ కట్టాలి. దీనికి కూడా జీఎస్టీ అదనం. ఈ నిబంధనలకు లోబడి మాత్రమే వినియోగదారుడు చెల్లించిన రూ.1500 తిరిగి వస్తాయి. ఈ వివరాలన్నీ జియో అధికారిక వెబ్సైట్లో ఉన్నాయి.
మరోవైపు ఇన్నాళ్లూ ఎంతో ఆశగా ఎదురుచూసిన వినియోగదారులు జియో తాజా నిబంధనలపై భగ్గుమంటున్నారు. జియో ఉచిత ఆఫర్ల అసలు గుట్టు బట్టబయలైందని మండిపడుతున్నారు. గతంలో ప్రకటించకుండా నిబంధనలు ఇప్పుడు ప్రకటించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.