జియో జంఝాటం: బేసిక్ ప్లాన్తో పాటు ఈ టాప్అప్ తప్పనిసరి
ముంబై: టెలికాంరంగంలో విప్లవం తీసుకొచ్చిన రిలయన్స్ జియో ముందుగా అన్నీ ఉచితం అని చెప్పి కొన్నేళ్లకు కస్టమర్లపై గుదిబండ వేసింది. ఇకపై నాన్ జియో నెంబెర్లకు ఫోన్ చేస్తే నిమిషానికి ఆరుపైసలు వసూలు చేస్తోంది. అక్టోబర్ 10 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. అయితే చాలామందిలో జియోకు సంబంధించి రీచార్జ్ ప్లాన్లు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. జియోను రీచార్జ్ చేసుకునేందుకు రెండు రకాల ప్లాన్లను జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకటి బేసిక్ ప్లాన్ కాగా రెండోది ఇంటర్కనెక్ట్ యూసేజ్ ఛార్జీలు(ఐయూసీ)పేరుతో టాప్అప్లు.
నాన్ జియో నెంబర్లకు ఐయూసీ టాప్అప్
రెండు రీచార్జ్ ప్లాన్లలో ఒకటి బేసిక్ ప్లాన్ ముందు ఎలాగుండేదో అలానే ఉంటుండగా మరొకటి నాన్ జియో నెంబర్లకు అంటే వోడాఫోన్, ఎయిర్టెల్లాంటి నెట్వర్క్లకు జియో నెంబరు నుంచి ఫోను చేస్తే నిమిషానికి ఆరుపైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసమే మరో రీఛార్జ్ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఐయూసీ టాప్ అప్ ప్లాన్ అని పిలుస్తారు. అక్టోబర్ 9వ తేదీవరకు రీఛార్జ్ చేసుకున్న జియో కస్టమర్లు తమ ప్లాన్ ముగిసేవరకు అలానే ఉంటుందని అక్టోబర్ 10వ తేదీ నుంచి రీచార్జ్ చేసుకునే కస్టమర్లు మాత్రం ఇతర నెట్వర్క్లకు ఫోన్ చేయాలంటే మరో టాప్అప్ ప్లాన్తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
రూ.10 నుంచి రూ.1000 వరకు ఐయూసీ టాప్అప్లు
ఇక ఇంటర్ యూసేజ్ కనెక్ట్కు సంబంధించి టాప్అప్లు రూ.10 నుంచి రూ. 1000 వరకు ఉంటాయని జియో పేర్కొంది. జియో రీచార్జ్ ప్లాన్లు చాలా ఉన్నాయి. రూ.98తో ప్రారంభమైతే 149, 198,299,349,397,399,448,449,498,509,799 ఉండగా దీర్ఘకాలిక ప్లాన్లు రూ.9,999 వరకు ఉన్నాయి. ఈ మెయిన్ ప్లాన్లను సెలెక్ట్ చేసుకుంటే ఐయూసీ టాప్అప్ ప్లాన్లు వీటితోనే వస్తున్నాయి. అంటే రూ. 10 నుంచి రూ.1000వరకు ఐయూసీ ప్లాన్లు వస్తున్నాయి. ఉదాహరణకు రూ.399తో రీచార్జ్ చేసుకుంటే ఐయూసీ టాప్అప్ రూ.10 వస్తుంది. ఇది 124 నిమిషాల ఐయూసీ టాక్టైమ్తో పాటుగా 1జీబీ అదనపు డేటా కూడా వస్తుంది. ప్రతి రూ.10 ఐయూసీ టాప్అప్తో అదనంగా 1 జీబీ డేటా పొందుతారు.
ఇతర ఆపరేటర్లకు వద్దనుకుంటే ...
ఒకవేళ ఇతర ఆపరేటర్లకు వాయిస్ కాల్స్ చేయరని భావిస్తే అందుకు ఐయూసీ ప్లాన్ తీసుకోనవసరం లేదు. ప్లాన్లలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. కస్టమర్ బేసిక్ ప్లాన్ మాత్రమే రీచార్జ్ చేయించుకుంటే సరిపోతుంది. అయితే ఇతర ఆపరేటర్లకు మాత్రం ఔట్గోయింగ్ కాల్స్ చేసుకునే వీలుండదు. ఇదిలా ఉంటే బేసిక్ ప్లాన్లతో ఒక పరిమితి వరకే ఇతర ఆపరేటర్లకు ఫోన్ చేసుకునే అవకాశం ఉంటుందని ఆ తర్వాత తప్పనిసరిగా ఐయూసీ రీచార్జ్ చేయించుకోవాల్సిందేనని జియో సంస్థ స్పష్టం చేసింది. అయితే వాయిస్ కాలింగ్ యాప్ అంటే వాట్సాప్ ద్వారా ఇతర నెట్వర్క్లకు ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని వివరించింది. ఇతర ఆపరేటర్లకు మెసేజ్ పంపాలంటే ఐయూసీ ఉండక్కర్లేదని వివరించింది.