శుభవార్త: మళ్లీ జియో ఫోన్ బుకింగ్స్ ప్రారంభం, కానీ వారికి మాత్రమే...
ఎట్టకేలకు రిలయన్స్ జియో గుడ్ న్యూస్ చెప్పింది. తన జియో ఫోన్ బుకింగ్స్ను మళ్లీ ప్రారంభించింది. అయితే, ఇంతకుముందు ఆసక్తి కనబరిచిన వారికి మాత్రమే ఈ ఫోన్ ను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
న్యూఢిల్లీ: ఎట్టకేలకు రిలయన్స్ జియో గుడ్ న్యూస్ చెప్పింది. తన జియో ఫోన్ బుకింగ్స్ను మళ్లీ ప్రారంభించింది. అయితే, ఇంతకుముందు ఎవరైతే ఫోన్ కొనేందుకు ఆసక్తి కనబరిచారో వారికి మాత్రమే ఈసారి ఫోన్ బుక్ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది.
ఆగస్టు 24న జియో ఫ్రీ ఫోన్కు బుకింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 60 లక్షల మంది ఈ ఫోన్ను బుక్ చేసుకున్నారు. అంతకుముందు జులైలోనే చాలా మంది తాము ఫోన్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు.
అలా ఆసక్తి కనబరిచిన 10 లక్షల మందికి ఇప్పుడు మళ్లీ జియో ఎస్సెమ్మెస్లు పంపుతోంది. అందులో ఉన్న నంబర్కు ఫోన్ చేయడం ద్వారా గానీ, లింక్పై క్లిక్ చేయడం ద్వారా గానీ జియో ఫోన్ను బుక్ చేసుకోవచ్చు.
బుకింగ్ సమయంలో రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. వారికి ఎప్పుడు ఫోన్ను అందజేస్తారన్నది తెలియపరుస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫ్రీ ఫోన్ పేరిట తీసుకొచ్చిన ఈ ఫోన్కు రూ.1500 డిపాజిట్ చెల్లించాలనే విషయం తెలిసిందే.
36 నెలల తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని తొలుత ప్రకటించిన జియో ఆ తరువాత నిబంధనలను సవరించింది. తొలి ఏడాది ఫోన్ను తిరిగిస్తే రూ.500, రెండో ఏడాది తిరిగిస్తే రూ.1000, మూడో ఏడాది రిటర్న్ చేస్తే రూ.1500 కంపెనీ చెల్లిస్తుంది. అయితే, ఇందుకు వినియోగదారులు ఏడాదికి కనీసం రూ.1500 ఫోన్కు రీఛార్జి చేయాల్సి ఉంటుంది.