షాకింగ్ న్యూస్: జియో ఫోన్ డెలివరీ డేట్ అక్టోబర్ 1కి వాయిదా!? అధిక డిమాండే కారణమా?
జియో అభిమానులకు షాకింగ్ న్యూస్. సెప్టెంబర్ 21 నుంచి డెలివరీ కావాల్సిన జియో ఫోన్ తేదీలను కంపెనీ మరోసారి వాయిదా వేసినట్టు తెలిసింది. డిమాండ్ అధికంగా ఉండడమే దీనికి కారణమట.
ముంబై: ఈ నవరాత్రికి జియో ఫోన్ తమ చేతుల్లోకి వచ్చేస్తుందంటూ ఎంతో ఆశగా.. ఆతృతగా ఎదురుచూస్తున్న జియో అభిమానులకు షాకింగ్ న్యూస్. నేటి నుంచి డెలివరీ కావాల్సిన జియో ఫోన్ తేదీలను కంపెనీ మరోసారి వాయిదా వేసినట్టు తెలిసింది.
సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 1కి ఈ ఫోన్ డెలివరీ డేట్ను వాయిదా వేసినట్టు సమాచారం. ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ సమయంలో అనూహ్య స్పందన రావడంతో, డెలివరీ తేదీని కంపెనీ వాయిదా వేస్తూ వెళుతోంది.
వీజీఏ కెమెరా, 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2.4 అంగుళాల డిస్ప్లే, 512ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ జియో ఫోన్ ఫీచర్లు.
ఆగస్టు 24న ఈ జియో ఫోన్ ప్రీ-బుకింగ్స్ చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ భారీ ఎత్తున డిమాండ్ రావడంతో ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ప్రీ-బుకింగ్స్ ను కూడా కంపెనీ నిలిపివేసింది.
జులై 21న రిలయన్స్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియోఫోన్ పేరుతో ఫీచర్ ఫోన్ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆవిష్కరించిన రోజే, సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ఫోన్ల డెలివరీ ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
కానీ డిమాండ్ అధికంగా రావడంతో, వీటి డెలివరీ మరికొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ ఫోన్ వినియోగదారుల చేతుల్లోకి వస్తుందని తొలుత కంపెనీ ప్రకటించింది.
కానీ ఈ నవరాత్రికి కాకుండా... అక్టోబర్ 1వ తేదీ నుంచి దీన్ని అందించాలని కంపెనీ చూస్తున్నట్టు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. తమకు జియో నుంచి మెసేజ్ వచ్చిందని, ఫోన్ల డెలివరీ అక్టోబర్ 1కి వాయిదా వేసినట్లు చెప్పారని ఓ రిటైలర్ వెల్లడించారు.
ఇప్పటికే లక్షల మంది జియో అభిమానులు బుక్ చేసుకొని ఈ జియోఫోన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఫోన్ల డెలివరీ వాయిదా పడటం కస్టమర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేసే విషయమే.
గుడ్డిలో మెల్ల అన్నట్లు.. కాస్త ఉపశమనం కలిగించే వార్త ఏమిటంటే.. గతంలో నిలిపివేసిన ప్రీ-బుకింగ్స్ను కంపెనీ త్వరలోనే మళ్లీ ప్రారంభించనుందట. ఈ ఫోన్ ఫ్రీ-అయినప్పటికీ, బుకింగ్ సమయంలో రూ.500, డెలివరీ సమయంలో రూ.1000 కట్టాల్సి ఉంటుంది. మూడేళ్ల అనంతరం ఈ మొత్తాన్ని కంపెనీ వినియోగదారులకు రీఫండ్ చేయనుంది.