హరియాణాలో బీజేపీకి జై కొట్టిన జేజేపీ, జైలు నుంచి బయటకు దుశ్యంత్ తండ్రి చౌటాలా !
న్యూఢిల్లీ: హరియాణాలో బీజేపీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామం కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జననాయక్ జనతా పార్టీ (JJP)చీఫ్ దుశ్యంత్ చౌటాలా తండ్రి అజయ్ చౌటాలా జైలు నుంచి బయటకు రావడానికి పెరోల్ మంజూరు అయ్యింది. బీజేపీతో దోస్తి కట్టిన ఒక్కరోజులో దుశ్యంత్ చౌటాలా తన తండ్రి అజయ్ చౌటాలా జైలు నుంచి బయటకు వచ్చేలా పావులు కదపడంతో మరోసారి తన సత్తా చాటుకున్నారు.
ప్రమాణ స్వీకారం
హరియాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతోందని, ముఖ్యమంత్రి, మంత్రులు, తన కుమారుడు దుశ్యంత్ చౌటాలాల ప్రమాణ స్వీకారానికి హాజరు కావడానికి తనకు పెరోల్ మంజూరు చెయ్యాలని జైల్లో ఉన్న అజయ్ చౌటాలా జైళ్ల శాఖ అధికారులకు మనవి చేశారు.
గ్నీన్ సిగ్నల్
అజయ్ చౌటాలా మనవి పరిగణలోకి తీసుకున్న జైళ్ల శాఖ అధికారులు రెండు వారాల పాటు అజయ్ చౌటాలాకు పెరోల్ ఇవ్వడానికి అంగీకరించారు. శనివారం సాయంత్రం లేదా ఆదివారం అజయ్ చౌటాలా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆదివారం హరియాణా ముఖ్యమంత్రిగా మనోకహర్ లాల్ ఖట్టర్, ఉప ముఖ్యమంత్రిగా దుశ్యంత్ చౌటాలా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఇదే కార్యక్రమానికి హాజరుకావడానికి అజయ్ చౌటాలాకు పెరోల్ మంజూరు అయ్యింది.
చౌటాలాకు 10 ఏళ్లు జైలు శిక్ష
1999-2000లో ఉపాధ్యాయుల నియామకంలో పెద్త స్కాం జరిగింది అని నమోదైన కేసులో అరెస్టు అయిన మాజీ సీఎం ఓంప్రకాష్ చౌటాలా, ఆయన పెద్ద కుమారుడు చౌదరి అజయ్ సింగ్ చౌటాలాకు 2013లో ఢిల్లీ ప్రత్యేక కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
జైల్లో తండ్రి, కొడుకు
తండ్రి ఓంప్రకాష్ చౌటాలాతో పాటు అజయ్ చౌటాలా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అజయ్ చౌటాలా కుమారుడు దుశ్యంత్ చౌటాలా. బీజేపీ మద్దతు ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యడానికి సిద్దం అయిన దుశ్యంత్ చౌటాలా తండ్రిని జైలు నుంచి బయటకు తీసుకుస్తున్నారు.
బీజేపీ అధికార దుర్వినియోగం ?
హరియాణాలో అధికారం కోసం జేజేపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. పెరోల్ మీద బయటకు వస్తున్న అజయ్ చౌటాలా కుటుంబ సభ్యులతో రెండు వారాలు గడపనున్నారు. మొత్తం మీద దుశ్యంత్ చౌటాలా మరోసారి తన సత్తా చాటుకున్నారు.