బీజేపీతో జేజేపీ జట్టు..? కాంగ్రెస్ని కాదని కమలంతో దోస్తి..!!
హర్యానా రాజకీయాల్లో పూటకో ట్విస్ట్ నెలకొంటుంది. బీజేపీ అధికారం చేపట్టడం లాంఛనమే అయినందున.. 10 సీట్లు గెలుచుకున్న జేజేపీ కూడా మద్దతు ఇస్తామని ప్రకటించింది. దీంతో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వ పరంగా తిరుగులేకుండా పోతోంది. ఇప్పటికే ఇండిపెండెంట్ల మద్దతు కూడా ఉన్నందున బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు నల్లేరు మీద నడకే అవనుంది.
హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. బీజేపీ 40 సీట్లు గెలుచుకుంది. ఇప్పటికే ఇండిపెండెంట్లు 8 మంది మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీంతో హర్యానాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమే. కానీ ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్తో జట్టుకడతామని చెప్పిన జేజేపీ కూడా బీజేపీ గూటికి చేరనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. జేజేపీ 10 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
హర్యానా ఫలితాలు వెలువడిన తర్వాత వెంటనే కింగ్ మేకర్ అని జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా పేరు వినిపించింది. 31 సీట్లు గెలిచిన కాంగ్రెస్, జేజేపీ, ఇండిపెండెంట్ల మద్దతుతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సంకేతాలు వచ్చాయి. కానీ వెంటనే పరిణామాలు మారిపోయాయి. బీజేపీకి ఇండిపెండెంట్లు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పాటు నల్లేరు మీద నడకే అవుతుంది. బీజేపీ, కాంగ్రెస్కు జేజేపీ సమానదూరం పాటిస్తోందని చౌతాలా.. చెప్పారు. ఆ రెండు పార్టీలతో అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తామని పేర్కొన్నారు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో మనసు మార్చుకున్నారు. బీజేపీతో జతకట్టేందుకు సై అని సంకేతాలు ఇచ్చారు. పొత్తుకు సంబంధించి శుక్రవారం రాత్రి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.