హింసతో దేనిని సాధించలేం, దాడులు సరికాదు: సీఎం ముఫ్తీ
హింసతో ఎవరూ ఏమీ సాధించలేరని, మిలిటెంట్లు ఆయుధాలు వదిలేయాలని జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. కేవలం చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం కనుగొనగలమన్నారు.
శ్రీనగర్: హింసతో ఎవరూ ఏమీ సాధించలేరని, మిలిటెంట్లు ఆయుధాలు వదిలేయాలని జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. కేవలం చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం కనుగొనగలమన్నారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. బుద్గాంలో మంగళవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఏడు గంటలకు పైగా జరిగిన ఎన్కౌంటర్, కొందరు యువకులు రాళ్లు రువ్వుతూ పోలీస్ ఆపరేషన్కు అడ్డుతగలడం వంటి సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. రాళ్లు రువ్విన నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతాదళాలు జరిగిన పెల్లెట్ గన్ ఫైరింగ్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు.
ఈ పరిణాలపై ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడారు. హింస దేనికీ పరిష్కారం కాదన్నారు. దాడులు, ఎన్కౌంటర్లలో ఏటా వందలాది ఉగ్రవాదులతో పాటు అమాయక పౌరులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలకు చర్చలే పరిష్కారమన్నారు. హింసకు ప్రజలు ఆకర్షితులు కావద్దన్నారు. బుద్గాం వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం ప్రతి ఒక్కరి కర్తవ్యమన్నారు.