జేఎన్యూ దాడి: కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు, త్వరలోనే కేసు కొలిక్కి..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనలో ముసుగు ధరించిన వ్యక్తులకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే పోలీసులు ఈ కేసును చేధిస్తారని పేర్కొన్నాయి.
ఆదివారం సాయంత్రం జేఎన్యూ దాడి ఘటన తర్వాత విద్యార్థులు, అధ్యాపకుల్లో నెలకొన్న భయాందోళనలు పోగొట్టి, వారిని తగిన భరోసాను ఇచ్చి తిరిగి క్యాంపస్లో సాధారణ పరిస్థితులు ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని వర్సిటీ పాలక వర్గాలను కేంద్రం ఆదేశించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖతో జరిగిన సమావేశంలో జేఎన్యూ వైస్ ఛాన్సలర్ జగదీష్ కుమార్కు ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
జేఎన్యూలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఉన్న అన్ని మార్గాలను గురించి చర్చించడం జరిగిందని, సెమిస్టర్ పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సమ్మతంగా ఉన్న విద్యార్థుల కోసం త్వరలోనే ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
దాడి ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఇప్పటి వరకు ఎవరినీ ఈ కేసులో అరెస్ట్ చేయలేదు. కాగా, బుధవారం జేఎన్యూ భారీ ఎత్తున విద్యార్థులు చేరుకోవడంతో పోలీసులు కూడా నిఘా పెట్టారు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కాగా, ఆదివారం రాత్రి జేఎన్యూలో కొందరు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి వర్సిటీలోని విద్యార్థులు, అధ్యాపకులపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. కర్రలు, ఇనుపరాడ్లతో దాడులు చేయడంతో జేఎన్యూ ఎస్యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ తోపాటు పలువురు విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రంగా గాయపడ్డారు. రాజకీయ, సినీ ప్రముఖులు కూడా విద్యార్థులపై జరిగిన దాడిని ఖండించారు. దేశంలోని పలు యూనివర్సిటీల విద్యార్థులు దాడికి నిరసనగా భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు.