ఫెలోషిప్ నిలిపివేత: రోహిత్ బాటలో జెఎన్యూ దళిత స్కాలర్
న్యూఢిల్లీ: హెచ్సీయూలో పీహెచ్డీ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యపై ఆందోళనలు ఇంకా చల్లారకముందే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ మదన్ మెహర్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం కలకలం సృష్టిస్తోంది.
తన సమస్యను వారంలోగా తేల్చాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ జెఎన్యూ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్కు రాసిన రెండు లేఖలు ఆందోళన కలిగిస్తున్నాయి. తనకు రావాల్సిన ఫెలోషిప్ను నిలిపేశారని, పీహెచ్డీని మధ్యలోనే ఆపేశారని, వివక్ష కారణంగా తనను వేధిస్తున్నారని మదన్ మెహర్ ఆ లేఖలో పేర్కొన్నాడు.
వారంలోగా తన సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆ లేఖలో తెలిపాడు. అయితే దీనిపై యూనివర్సిటీ వాదన మరోలా ఉంది. దీనిపై వైస్ ఛాన్సలర్ హెచ్.శర్మ మాట్లాడుతూ మదన్ మెహర్ గతంలో బ్రసెల్స్, బెల్జియం దేశాల్లో రీసెర్చ్ నిమిత్తం యూనివర్సిటీ నుంచి రూ. 66,000 తీసుకున్నాడని తెలిపారు.
ఫెలోషిప్ కొనసాగించడానికి అతను యూనివర్సిటీకి పడ్డ బకాయిని చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. బకాయిలు ఉన్నందున వర్సిటీ కంట్రోలర్ అండ్ ఫైనాన్స్ విభాగం అధికారి నుంచి అనుమతి లభించలేదని, దీంతో అతని సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొడిగింపును నిలిపి వేసినట్టు తెలిపారు.
ఆత్మహత్య లేఖల నేపథ్యంలో రీసెర్చ్ స్కాలర్ మదన్ మెహర్ని కనిపెట్టుకొని ఉండమని వర్సిటీ సిబ్బందిని ఆదేశించామని, త్వరలోనే అతని సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మరో అధికారి హామీ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఫిబ్రవరి 8న విద్యార్థులతో వర్సిటీ అధికారులు భేటీ కానున్నారు.