ఢిల్లీ పోలీసుల సంచలనం- జేఎన్యూ హింసపై తమకు తాము క్లీన్చిట్ ఇచ్చుకున్న వైనం..
ఢిల్లీలో ఈ ఏడాది జనవరి 5న అర్ధరాత్రి క్యాంపస్లోకి దూరిన కొందరు అగంతకులు విద్యార్ధులను చితకబాదారు. అప్పటి దాడుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పలువురు విద్యార్ధి సంఘ నేతలతో పాటు విద్యార్ధులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో పోలీసుల పాత్రపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వీటిపై విచారణ జరిపిన నిజనిర్దారణ కమిటీ మాత్రం వీరికి క్లీన్ చిట్ ఇవ్వడం సంచలనం రేపుతోంది.
ఈ ఏడాది జనవరి 5న అర్ధరాత్రి ఢిల్లీ జవహర్ లాల్ యూనివర్శిటీ క్యాంపస్లోకి 100 మంది ముసుగులు వేసుకుని ప్రవేశించారు. నాలుగు గంటల పాటు విద్యార్ధులను వీరు చితకబాదారు. ఈ దాడుల్లో 36 మంది విద్యార్ధులు, అధ్యాపకులు కూడా గాయపడ్డారు. వీరిలో పలువురు విద్యార్ధి సంఘ నేతలు కూడా గాయాలపాలయ్యారు. యూనివర్శిటీలో ఇంత జరుగుతున్నా పోలీసులు బయటే ఎందుకు ఉండిపోయారన్న దానిపై ప్రశ్నలు తలెత్తాయి. అంతకుముందు ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో పోలీసుల ఓవరాక్షన్పై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసులు అలా వ్యవహరించారా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి.
ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేసినా ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. దీంతో ఈ ఘటన వెనుక బీజేపీ ఉందనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి సమయంలో జేఎన్యూ ఘటనపై ఢిల్లీ పోలీసు శాఖ జాయింట్ కమిషనర్ షాలినీ సింగ్ నేతృత్వంలో ఓ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ యూనివర్శిటీకి వెళ్లి విద్యార్ధులను కలిసింది. వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాత వెల్లడించిన నివేదికలో పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఈ నివేదిక సంచలనం రేపుతోంది. ఉదయం క్యాంపస్ బయట డ్యూటీలో ఉన్న పోలీసులు రాత్రి కల్లా డ్యూటీ ముగించుకుని వెళ్లిపోయారని నివేదికలో చెప్పడం వివాదాస్పదంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు క్యాంపస్ బయట ధర్నాలు జరగకుండా చూడటమే వారి బాధ్యత అని నివేదికలో తెలిపారు.
Recommended Video
అంతే కాకుండా రాత్రి 3.45 నుంచి 4.15 వరకూ పోలీసులకు జేఎన్యూలో దాడులు జరుగుతున్నాయని కాల్స్ వచ్చాయని, విద్యార్ధులే కొట్టుకుంటున్నారని భావించామని, ఉదయం ఆరున్నర గంటల తర్వాత వాట్సాప్ మెసేజ్ చూసి స్పందించామని నివేదికలో చెప్పారు.