కేజ్రీకి మోడీ షాక్: ఢిల్లీ వర్సిటీలో ఎబివిపి ప్రభంజనం
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (డియూఎస్యూ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) క్లీన్ స్వీప్ చేసింది.
ఏబీవీపీ తరపున అధ్యక్షుడిగా పోటీ చేసిన సతీందర్ అవానా, ఉపాధ్యక్షుడిగా బరిలో నిలబడ్డ సన్నీ దేఢా, కార్యదర్శిగా నిలబడ్డ అంజలీ రాణా, సంయుక్త కార్యదర్శిగా పోటీ పడ్డ ఛత్రపాల్ యాదవ్ లు విజయం సాధించారు.
కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) అభ్యర్థుల నుంచి నామమాత్రపు పోటీ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అనుబంధ ఛాత్ర యువ సంఘర్ష్ సమితి నుంచి పెద్దగా పోటీ రాకపోవడంతో ఏబీవీపీ ఘన విజయం సాధించింది.
వర్శిటీ విద్యార్థుల్లో 43.3 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు చెప్పారు. నాలుగు అత్యున్నత స్థాయి పదవుల కోసం జరిగిన ఈ పోరులో వరుసగా రెండో ఏడాది కూడా ఎబివిపి అన్ని స్థానాలు కైవసం చేసుకుంది.
ఈ ఎన్నికల్లో ఒక్కో దానిలో 4,500 ఓట్లకు పైగా ఆధిక్యంతో ఎన్ఎస్యూఐ పైన ఏబీవీపీ విజయ ఢంకా మోగించింది. ఏపీబీవీ గెలుపు నేపథ్యంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, బిజెపి జాతీయ అధ్యక్షులు నరేంద్ర మోడీ వారికి అభినందనలు తెలిపారు.
మరోవైపు, జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఎన్నికల్లో ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష పదవిని దక్కించుకుంది. ఏబీవీపీ జాయింట్ సెక్రటరీ పదవిని దక్కించుకుంది. ఏఐఎస్ఏ అభ్యర్థిని ఎబివిపి అభ్యర్తి 28 ఓట్ల తేడాతో ఓడించారు.