జెఎన్యు గొడవలో ఊహించని ట్విస్ట్: ఏబీవీపీకి రిజైన్
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గత కొద్ది రోజులుగా వేడి రాజుకుంటోంది. తాజాగా, కొత్త ట్విస్ట్. ముగ్గురు అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థులు తమ పదవులకు రాజీనామా చేశారు.
కోర్టులో న్యాయవాదుల దాడికి నిరసనగా వర్శిటీకి చెందిన ఏబీవీపీ జాయింట్ సెక్రటరీ ప్రదీప్ నర్వాల్, జెఎన్యు స్కూల్ ఏబీవీపీ విభాగం అధ్యక్షుడు రాహుల్ యాదవ్, కార్యదర్శి అంకిత్ హాన్స్లు తమ పదవులకు గురువారం రాజీనామా చేశారు.
ప్రభుత్వం చేసే పనులకు తాము భజంత్రీలుగా ఉండే అవకాశమే లేదని వెల్లడించారు. కన్నయ్యపై మోపిన ఆరోపణలు వెనక్కు తీసుకుని తక్షణం విడుదల చేయాలని కోరుతూ.. మండీ హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించగా, దాదాపు అన్ని సంఘాలూ దీనికి మద్దతు పలకడం గమనార్హం.
ఫిబ్రవరి 9వ తేదీన జెఎన్యులో జాతి వ్యతిరేక నినాదాల, అఫ్జల్ గురు సంతాప సభ నేపథ్యంలో కన్నయ్యను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తీరు తీవ్రవాదులకు మద్దతుగా కనిపిస్తోందని బిజెపి చెప్పగా, తమ ఒంట్లోనే దేశభక్తి ఉందని కాంగ్రెస్ చెబుతోంది.