జేఎన్యూ విద్యార్థుల వెనుక నేను లేను: హఫీజ్
లాహోర్: ఢిల్లీలోని జేఎన్యూలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమానికి తాను మద్దతు ఇచ్చినట్లు భారత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను జామత్ ఉద్ దవా అధిపతి హఫీజ్ మహమ్మద్ సయీద్ నిరాకరించాడు.
యూట్యూబ్లో పెట్టిన ఒక వీడియోలో మాట్లాడిన హఫీజ్.. ఒక ట్వీట్లో ఉన్న తన పేరును ఆధారంగా చేసుకుని దీని వెనుక తానున్నట్లు హోం మంత్రి వ్యాఖ్యానించడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు.
జేఎన్యూ విద్యార్థుల వెనుక తాను లేనని, వారిని ప్రోత్సహిస్తూ ఎలాంటి ట్వీట్ చేయలేదని పేర్కొన్నాడు. అది బోగస్ ట్వీట్ అని తెలిపాడు. భారత మంత్రి ప్రపంచాన్ని, తన దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించాడు.
కాశ్మీర్ అంశంపై హఫీజ్ పలు వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీరీ స్వేచ్ఛ పోరాటాన్ని ‘జోక్'లా మార్చవద్దన్నాడు. తాను కాశ్మీరీ విద్యార్థులను ప్రోత్సహించడం లేదని పునరుద్ఘాటించాడు. భారత్ కాశ్మీర్ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నాడు.
కాశ్మీర్ ఉద్యమం అక్కడి స్థానికుల నుంచి పుట్టింది.. వారు స్వరం వినిపించకూడదా? అని ప్రశ్నించాడు. భారత బలగాలు కాశ్మీర్లో మొహరించడం వారి స్వేచ్ఛను హరించడానికేనని వ్యాఖ్యానించాడు. రాజ్నాథ్ లాంటి వాళ్లు తమ దృక్పథాన్ని మార్చుకోవాలని అన్నాడు.