రాహుల్గాంధీ: 'హైద్రాబాద్' మైలేజ్, ఢిల్లీలో పోయింది!
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నారా? అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో సాగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిన్న హైదరాబాదులోని సెంట్రల్ విశ్వవిద్యాలయంలో వేముల రోహిత్ మృతి పైన, నేడు ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కన్నయ్యకు ఆయన మద్దతుగా నిలిచారు.
వేముల రోహిత్కు చెందిన సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు అనుకూలంగా ఉందని కొందరు ఆరోపిస్తున్నప్పటికీ.. అప్పుడు రాహుల్ గాంధీకి మంచి మైలేజ్ వచ్చింది. అయితే, ఇప్పుడు జెఎన్యులో తీవ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా సభ జరిగిన వారికి రాహుల్ అండగా నిలబడటాన్ని చాలామంది తప్పుపడుతున్నారు.
ఈ విషయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోను చర్చ జరుగుతోందని అంటున్నారు. రాహుల్ గాంధీ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడుతున్నారని పార్టీలో కొందరు నేతలు గుసగుసలాడుకుంటున్నారని అంటున్నారు. హైదరాబాదులోని హెచ్సియులో వచ్చిన మైలేజీని జెఎన్యు ద్వారా పోగొట్టుకున్నారంటున్నారు.
పార్లమెంటు పైన దాడికి ప్లాన్ చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా జెఎన్యులో సభ నిర్వహించడం, వారిని అరెస్టు చేస్తే రాహుల్ గాంధీ వారికి మద్దతు పలకడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు. అతివాద ఓట్ల కోసం తీవ్రవాదులకు అనుకూలంగా ఉన్నవారికి మద్దతు పలకడమేమిటనే ప్రశ్న అందరిలో తలెత్తుతోందంటున్నారు.
రాహుల్ గాంధీ మద్దతు పలకడాన్ని సామాన్యులు ఎవరూ జీర్ణించుకోవడం లేదని అంటున్నారు. దీనిని గుర్తించి ఇప్పుడు రాహుల్, కాంగ్రెస్ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ రాజకీయాల్లో పరిపక్వతక కోసం మరోసారి గతంలో వెల్లి వచ్చినట్లు విదేశాలకు వెళ్లి వస్తే బాగుంటుందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు, గతంలో ఢిల్లీ, బీహార్.. ఇలా వరుస ఎన్నికల్లో బిజెపికి గట్టి షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికలలోను ఎదురు దెబ్బ తగిలింది. అయితే, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం బిజెపి మళ్లీ పుంజుకున్నట్లుగా కనిపించింది.
కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాలు 12కు ఏడు స్థానాల్లో విజయం సాధించాయి. బిజెపి స్వయంగా నాలుగు చోట్ల గెలిచింది. అందులో అంతకుముందు బిజెపి సీటు ఒక్కటే. ఇప్పుడు మూడు అదనంగా గెలిచింది. బిజెపి స్వయంగా ముజఫర్ నగర్లోను గెలవడం గమనార్హం.
కేవలం ఉప ఎన్నికలే కాదు.. ఇటీవల జరిపిన ఒకటి రెండు సర్వేల్లో... ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎన్డీయే కూటమి 280కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడైంది. అలాగే మోడీ పాలనలో 65 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని సర్వే తెలిపింది. అదే సమయంలో మోడీకి ప్రత్యర్థిగా రాహుల్ ఎదుగుతున్నారని కూడా సర్వేలో తేలింది. అయితే, జెఎన్యు విషయమై రాహుల్ తీరుపై కాంగ్రెస్ పార్టీలోనే చర్చ సాగుతోందట.