డ్రగ్స్ ఇచ్చి జేఎన్ యూ విద్యార్థినిపై రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ పీహెచ్ డీ విద్యార్థినికి డ్రగ్స్ ఇచ్చి హాస్టల్ గదిలోనే సాటి విద్యార్థి అత్యాచారం చేసి పరారైనాడు. నచ్చిన సినిమాను పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకోవడానికి వెళ్లిన ఆ యువతి మీద కామాంధుడు అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు.
ప్రసిద్ధి చెందిన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో 28 ఏళ్ల యువతి పీహెచ్ డీ చేస్తున్నది. తనకు నచ్చిన సినిమా ఎవరి దగ్గరైనా ఉంటే చెప్పాలని ఫేస్ బుక్ లో మేసేజ్ పెట్టింది. తన దగ్గర ఆ సినిమా ఉందని అన్మోల్ రతన్ (29) అనే విద్యార్థి సమాచారం ఇచ్చాడు.
సినిమా కాపీ చేసుకోవడానికి బ్రహ్మపుత్ర హాస్టల్ కు రావాలని అతను చెప్పాడు. అన్మోల్ రతన్ మాటలు నమ్మిన ఆ యువతి హాస్టల్ గదిలోకి వెళ్లింది. ఆ సందర్బంలో ఆమెకు డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు.
కూల్ డ్రింక్ తాగిన కాసేపటికి తాను స్పృహ కోల్పోయానని, తరువాత అతను తన మీద అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు మెలుకు వచ్చిన తరువాత కేకలు వెయ్యడానికి ప్రయత్నించానని, రతన్ తన నోరు మూసి వేశాడని ఆమె పోలీసులకు చెప్పింది.
విషయం బయటకు చెబితే తాను చంపేస్తానని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ కు చెందిన రతన్ బెదిరించాడని బాధితురాలు పోలీసులకు చెప్పారు. వసంత్ కుంజ్ పోలీసులు రతన్ మీద కేసు నమోదు చేశారు.
ఆమెను వైద్య పరీక్షలకు పంపించామని పోలీసులు అన్నారు. రతన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఏఐఎస్ఏ అతని ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ వ్యవహారంపై తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జేఎన్ యూ రిజిస్ట్రార్ ప్రమోద్ కుమార్ తెలిపారు.
యూనివర్శిటీ సెక్యూరిటీ విభానికి ఫిర్యాదు అందలేదని, తాను యూనివర్శిటీ సెక్యూరిటీ విభాగం అధికారులను వివరణ అడిగానని, వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదని అన్నారు. పరారైన రతన్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.