జేఎన్యూ దాడి: వారి ఫోన్లు సీజ్ చేయాలంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ)లో దుండగుల దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను వీలైనంత త్వరగా పోలీసులకు అందజేయాలని ఢిల్లీ హైకోర్టు యూనివర్సిటీ నిర్వాహకులను ఆదేశించింది. అంతేగాక, యూనిటీ ఎగనెస్ట్ లెఫ్ట్, ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న సభ్యులకు సమన్లు పంపించి వారి ఫోన్లను స్వాధీనపర్చుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు.
జేఎన్యూ దాడికి సంబంధించిన సందేశాలు, వీడియోలను చట్ట ప్రకారం భద్రపరచాల్సిందిగా వాట్సాప్, గూగుల్ను ఆదేశించింది. జేఎన్యూ దాడి అంశంపై వర్సిటీ ప్రొఫెసర్లు కొందరు వ్యాజ్యం దాఖలు చేయగా దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. దాడి జరగడానికి ముందు రెండు వాట్సాప్ గ్రూపుల్లో దీనికి సంబంధించిన చర్చలు జరిగాయని, ఈ సంభాషణలను, వాటిని జరిపిన వారి వివరాలను సమర్పించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జనవరి 5న ముసుగులు ధరించిన కొందరు దుండగులు కర్రలు, రాడ్లతో జేఎన్యూలోకి వచ్చి పలువురు విద్యార్థులు, అధ్యాపకులను తీవ్రంగా గాయపర్చారు. జేఎన్యూ ఎస్యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ తోపాటు పలువురు విద్యార్థులు, అధ్యాపకులు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందారు.
జేఎన్యూలో జరిగిన దాడి ఘటనను రాజకీయ, సినీ ప్రముఖలు తీవ్రంగా ఖండించారు. బాధితులను బాలీవుడ్ నటి దీపిక పదుకొనె యూనివర్సిటీకి వచ్చి పరామర్శించారు. దీపిక వర్సిటీకి వచ్చిన సమయంలో అక్కడ వర్సిటీ మాజీ విద్యార్థి కన్నయ్య కూడా ఉండటంతో ఆమె టుక్డే టుక్డే గ్యాంగ్కు మద్దతు పలుకుతున్నారంటూ పలువురు బీజేపీ నేతలు విమర్శించారు. అంతేగాక, దీపిక నటించిన తాజా చిత్రాన్ని చూడవద్దంటూ పిలుపునిచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీపై మండిపడ్డారు. జేఎన్యూకి కాకుండా నాగ్పూర్కు వెళ్లాలా? అంటూ ప్రశ్నించారు.