జేఎన్యూ విద్యార్థులకు మరో అవకాశం.. లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవన్న వీసీ జగదీశ్
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో హింస, ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన సెమిస్టర్ ఫీజుల వ్యవహారంపై వైస్ చాన్సల్ మామిడాల జగదీశ్ కుమార్ గురువారం కీలక ప్రకటన చేశారు. సెమ్ రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 17(శుక్రవారం) వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. జేఎన్యూ యాజమాన్యం ఫీజు గడువు పొడిగించడం ఇది వరుసగా మూడోసారి.
''వింటర్ సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు గడువు జనవరి 17 వరకు పొడిగించాం. రూ.500లేట్ ఫీజుతో ఫిబ్రవరి 9 వరకు విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 9లోగా పేర్లు నమోదు చేసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అలాంటి వాళ్లు వీసీకి రాతపూర్వకంగా నివేదించుకోవాల్సి ఉంటుందని, అయితే వాళ్లను అనుమతించాలా? వద్దా? అన్నది పూర్తిగా వీసీ నిర్ణయమే''అని ప్రకటనలో పేర్కొన్నారు.
జేఎన్యులో మొత్తం 8,500 మంది విద్యార్థులు ఉండగా, క్యాంపస్ లోనే వివిధ హాస్టళ్లలో ఉంటున్నవారి సంఖ్య 6,450గా ఉందని, మిగిలినవాళ్లంతా స్కాలర్లేనని వీసీ జగదీశ్ కుమార్ తెలిపారు. స్కాలర్లలో 95 శాతం మంది ఇప్పటికే సెమిస్టర్ బకాయిలు చెల్లించారని, క్యాంపస్లోని హాస్టళ్లలో ఉంటున్న 65 శాతం మంది విద్యార్థులు కూడా కొత్త హాస్టల్ ఛార్జీలు చెల్లించారని ఆయన గుర్తుచేశారు.
జనవరి 5న ముసుగులు ధరించిన దుండుగుల విద్యార్థులపై దాడికి పాల్పడటం, అందకంటే ముందు లెఫ్ట్ సంఘాల లీడర్లు క్యాంపస్ లో విద్యార్థుపై దౌర్జన్యం చేయడం తదితర ఘటనల్లో నమోదైన కేసులను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారని, కేసుల విషయంలో తాను కామెంట్ చేయబోనని జేఎన్ యూ వీసీ జగదీశ్ స్పష్టం చేశారు.