జేఎన్యూ విద్యార్థిపై దేశ ద్రోహం : దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు..
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)కి చెందిన శార్జిల్ ఇమామ్పై అసోం పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొడుతున్నాడన్న ఆరోపణలతో అసాంఘీక కార్యకలాపాల నిరోధక చట్టం ఊపాతో పాటు నేరపూరిత కుట్ర కేసులను నమోదు చేశారు. భారత్ నుంచి అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసేందుకు ఉద్యమించండని శార్జిల్ ఇమామ్ ప్రసంగిస్తున్న వీడియో ఒకటి వెలుగుచూడటంతో అతనిపై కేసులు నమోదయ్యాయి.
హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు : అసోం మంత్రి
ఢిల్లీలోని షాహీన్బాగ్లో సీఏఏకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో శార్జిల్ ఇమామ్ కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. శార్జిల్ ఇమామ్ అసోంపై చేసిన వ్యాఖ్యలు వెలుగుచూడటంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మ శార్జిల్పై విరుచుకుపడ్డారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి షాహీన్బాగ్లో ముస్లింలు.. హిందు,క్రైస్తవ,సిక్కు,బౌద్దులకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ముస్లింలకు ప్రత్యేక సివిల్ కోడ్ లాంటి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించినప్పుడు తామెవరం వాటికి వ్యతిరేకంగా ఆందోళన చేయలేదన్నారు.
వాళ్లు ఎప్పటికీ అలా నలిగిపోవాలని కోరకుంటున్నారు..
పొరుగుదేశాల్లో అణచివేతకు గురవుతున్న హిందువులు,క్రైస్తవులు,సిక్కులు,బుద్దిస్టులు మతం మారాలని, పాకిస్తాన్ ముస్లిం,షాహిన్బాగ్ ముస్లింల మధ్యలో వారు నలిగిపోవాలని కొంతమంది కోరుకుంటున్నారని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. అలీఘడ్ పోలీసులు చెబుతున్న ప్రకారం.. ఈ నెల ప్రారంభంలో అలీఘడ్ యూనివర్సిటీలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో శార్జిల్ ఇమామ్ అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి వేరు చేయాలని డిమాండ్ చేసినట్టు శర్మ తెలిపారు.
శార్జిల్ ఇమామ్పై కొనసాగుతున్న దర్యాప్తు..
సోషల్ మీడియాలో శార్జిల్ ఇమామ్ వీడియో ట్రెండ్ అవుతోందని.. ప్రాథమిక దర్యాప్తులో అది అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలో ఈ నెల 16న ప్రసంగించినదిగా గుర్తించామని అలీఘడ్ ఎస్పీ ఉమేశ్ కుమార్ తెలిపారు. ఇమామ్ అందులో జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడని అన్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని చెప్పుకొచ్చారు.
షాహిన్ బాగ్ ఆందోళనకారుల స్పందన..
షాహిన్బాగ్ ఆందోళనకారులు కూడా ట్విట్టర్ ద్వారా శార్జిల్ ఇమామ్ వీడియోనిపై స్పందించారు. ఏ ఒక్క వీడియోనో లేదా స్టేట్మెంటో.. షాహిన్బాగ్ ఉద్యమాన్ని నిర్వచించలేవని.. తమ ఉద్యమం రాజ్యాంగాన్ని,దేశ నైతికతను కాపాడటమేనని ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా ఘాటుగా స్పందించారు. ఓ వ్యక్తి జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పుడు.. అతన్ని అరెస్ట్ చేయకుండా ప్రెస్ మీట్స్ పెట్టుకుంటూ కూర్చోవడమేంటని ప్రశ్నించారు. దీన్నిబట్టి ఇదంతా మీ ప్లాన్లో భాగమేనేమో అనఅనుమానించాల్సి వస్తుందన్నారు.