దురాగతం: పార్టీకి రమ్మన్నారు కదాని వెళితే.. స్నేహితులే పాడు చేశారు
పార్టీకి రమ్మన్నారు కదాని వెళితే సామూహిక అత్యాచారం చేసిన ఉదంతమిది. దక్షిణ ఢిల్లీ లోని గ్రీన్ పార్క్ ప్రాంతంలో ఓ విద్యార్థినిపై ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ దేశీయులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
న్యూఢిల్లీ: పార్టీకి రమ్మన్నారు కదాని వెళితే సామూహిక అత్యాచారం చేసిన ఉదంతమిది. దక్షిణ ఢిల్లీ లోని గ్రీన్ పార్క్ ప్రాంతంలో ఓ విద్యార్థినిపై ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
బాధితురాలు(21) జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో బీఏ(ఆనర్స్) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గత వారం తన స్నేహితురాలితో కలిసి హౌజ్ ఖాన్ గ్రామంలోని ఒక పబ్ కు వెళ్ళింది.
అక్కడ ఆమెకు ఆఫ్ఘనిస్తాన్ కు చెందినా త్వాబ్ అహ్మద్ అలియాస్ సలీం(27)తో పరిచయం కలిగింది. తన స్నేహితుడు, ఆఫ్ఘనిస్తాన్ కే చెందిన సులేమాన్ అహ్మదీ(31)తో కలిసి ఉంటున్న సలీం.. బాధిత విద్యార్థినిని, ఆమె స్నేహితురాలిని తన ఇంట్లో పార్టీకి ఆహ్వానించాడు.
ఆమె అక్కడికి వెళ్లేసరికి సలీం స్నేహితులు సులేమాన్, సిద్ధాంత్, ప్రత్యూష ఉన్నారు. స్నేహితురాలు తిరిగి వర్సిటీకి వెళ్ళిపోగా ఈమె మాత్రం సలీం ఇంట్లో మద్యం సేవించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మద్యం మైకంలో పడిపోయిన బాధితురాలు.. తెల్లవారి లేచేసరికి తనపై సులేమాన్ బలవంతం చేయడం కనిపించింది. దీంతో మద్యం మత్తులో ఉన్న తనపై సలీం, సులేమాన్ ఇద్దరూ అత్యాచారానికి పాల్పడినట్లు ఆమెకు అర్థమైంది. ఆమె తిరిగి జె ఎన్ యూ హాస్టల్ కు వెళ్ళిపోయి, జరిగిన విషయాన్ని తన స్నేహితురాళ్లకు చెప్పగా, వారు వెంటనే ఆమెను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్ళారు.
పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న సలీంతో పటు అతడి స్నేహితుడైన సులేమాన్ ను కూడా పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.