జేఎన్యూ: కన్నయ్యకు మార్చి 2వరకు కస్టడీ
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్కు దిల్లీలోని పటియాలా హౌస్కోర్టు మార్చి 2వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కేసు విచారణ నిమిత్తం కన్నయ్యకుమార్ను పోలీసులు ఈరోజు న్యాయస్థానంలో హాజరు పరిచారు.
కేసు పూర్వాపరాలు విచారించిన న్యాయమూర్తి మార్చి 2 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాగా దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన కన్హయ్య కుమార్ రిమాండ్ నేటితో ముగియటంతో అతడిని ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు యత్నిస్తుండగా అక్కడే ఉన్న కొందరు న్యాయవాదులు అతడిపై దాడికి దిగారు.
అతన్ని చుట్టుముట్టిన పలువురు న్యాయవాదులు పిడిగుద్దులు కురిపించారు. లాయర్ల బారి నుంచి అతడిని తప్పించేందుకు పోలీసులు యత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో అతడు గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది.
పాటియాల హౌస్ కోర్టులో తాజా ఘటనలపై విచారణ పరిశీలనకు ఆరుగురు సీనియర్ సభ్యులతో కూడిన బృందాన్ని నియమిస్తూ జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అభయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ పోలీసులను నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ
పటియాలా హౌస్ కోర్టు వద్ద చోటు చేసుకున్న ఘటనలపై కేంద్ర హోంశాఖ స్పందించింది. న్యాయవాదులు, విద్యార్థుల ఘర్షణ, విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్, పాత్రికేయులపై దాడి తదితర ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
నలుగురికి నోటీసులు
జేఎన్యూ ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, వర్శిటీ రిజిస్ట్రార్లకు నోటీసులు జారీచేసింది. వర్శిటీలోకి పోలీసులు ఎందుకు ప్రవేశించాల్సి వచ్చిందో రెండు వారాల్లోగా తమకు తెలియజేయాలని ఆదేశించింది.
జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 13న ది హిందూ పత్రికలో ప్రచురితమైన కథనం ఆధారంగా కమిషన్ స్పందించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని, వర్శిటీలో రెండు గ్రూపుల మధ్య జరగుతున్న వివాదంలో తాను జోక్యం మాత్రమే చేసుకున్నానని కన్నయ్య కుమార్ తెలిపినట్లు కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
పోలీసులు అనాలోచితంగా వ్యవహరించి వర్శిటీలో ప్రవేశించడంతో విద్యార్థులు వారిని తరిమికొట్టారని కమిషన్ తెలిపింది. ఈ ఘటన మీడియాలో విస్తృతంగా ప్రసారమైన నేపథ్యంలో పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తూ విద్యార్థులు, విద్యా సంస్థల భావప్రకటన స్వేచ్ఛకు భంగం కల్గించారన్న ఆరోపణలు ఎక్కువగా వెల్లువెత్తుతున్నాయని కమిషన్ పేర్కొంది.