జేఎన్యూలో మళ్లీ హైటెన్షన్: రాష్ట్రపతిభవన్ వరకు ర్యాలీ, వీసీ సస్పెండ్కు డిమాండ్, అరెస్ట్, విడుదల
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ నెల 5వ తేదీన జరిగిన దాడులకు కారణం వైస్ చాన్స్లర్ ఎం జగదీశ్ కుమార్ అలసత్వమే కారణమని విద్యార్థులు ఆరోపించారు. వీసీని సస్పెండ్ చేయాలని రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా బయల్దేరారు. అయితే మధ్యలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
విద్యార్థుల అరెస్ట్
జేఎన్యూ నుంచి విద్యార్థులు ర్యాలీగా రాష్ట్రపతి భవన్ వెళ్లుండగా.. అంబేద్కర్ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వీసీ జగదీశ్ను తొలగించాలని విద్యార్థులు నినాదిస్తుండగా.. పోలీసులు అడ్డగించారు. వారిని అదుపులోకి తీసుకుని మందిర్ మార్గ్ పోలీసుస్టేషన్కు తరలించారు. తర్వాత విద్యార్థులను విడుదల చేసినట్టు జేఎన్యూ విద్యార్థి విభాగం ట్వీట్ చేసింది.
ఉద్రిక్తత
అంబేద్కర్ భవన్ వద్ద విద్యార్థులు భారీగా రావడం, పోలీసులు ఆగమనంతో హైటెన్షన్ నెలకొంది. రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు తప్పుకోవాలని పదే పదే విద్యార్థులకు సూచించారు. లౌడ్ స్పీకర్లో చెప్పినా విద్యార్థులు వినిపించుకోలేదు. దీంతో లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. పోలీసులు లాఠీ ఝులిపించడంతో ఓ విద్యార్థి తలకు గాయమైంది.
వీసీపై చర్యలకు డిమాండ్
విద్యార్థినులను సాయంత్రం 6 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. వారిలో మహిళ పోలీసు లేరని ఆరోపించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో విద్యార్థి ప్రతినిధి బృందం, ప్రొఫెసర్లతోపాటు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. వీసీని తక్షణమే పదవీనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.